24, ఆగస్టు 2024, శనివారం
21వ సామాన్య ఆదివారం
23, ఆగస్టు 2024, శుక్రవారం
దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51
పునీత బర్తలోమయి అపోస్తులుడు
దర్శన గ్రంథము 21:9- 14 యోహాను1:45-51
ఫిలిప్పు నతనయేలును కనుగొని, "మోషే ధర్మశాస్త్రమునందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడినవానిని మేముకనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడును, నజరేతు నివాసియునగు యేసు" అని చెప్పెను. "నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా? అని నతనయేలు అడుగగా, "వచ్చి చూడుము" అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి, అతనిని గూర్చి యేసు "ఇదిగో!కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు" అని చెప్పెను. "మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు?" అని నతనయేలు అడుగగా యేసు, "ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే, నీవు అంజూరపుచెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని" అని సమాధానమిచ్చెను. "బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, యిస్రాయేలు రాజువు" అని నతనయేలు పలికెను. "నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని, అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్పకార్యములను నీవు చూడగలవు" అని యేసు చెప్పెను. ఇంకను, "మీరు పరమండలము తెరువబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని పలికెను.
ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత బర్తలోమియో గారి పండుగను కొనియాడుకుంటున్నాము. పునీత బర్తలోమయి గారు పన్నెండు మంది శిష్యులలో ఒకరు. ఈయన గలిలియాలోని కానా గ్రామ నివాసి. వీరికి మరో పేరు నతనయేలు. నతనయేలు పవిత్ర జీవితం గడుపుతున్న యూదుడు. ఆయన రక్షకుడి రాకకోసం నిత్యం ప్రార్ధనలు చేసే భక్తుడు. ఫిలిప్పుగారికి ఆప్తమితృడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను శిష్యుడు. ఫిలిప్పు గారు మేము మెస్సియ్యను కనుగొంటిమి అని చెప్పగానే నతనయేలు యేసు ప్రభువును కలుసుకునేందుకు ఫిలిప్పు గారితో పాటు బయలు దేరాడు. యేసు ప్రభువు వారిని చూడగానే ఇదిగో కపటము లేని నిజమైన యిస్రాయేలీయుడు అని అంటున్నాడు. నతనయేలు అనగా నిష్కళంకమైన నిజాయితీ కలవాడని అర్ధం. నతనయేలు బోధకుడా! నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. క్రీస్తు కొరకు ఎదురు చూసి ఆయనను కనుకొని ఆయన కొరకు జీవిస్తూ, ఆయన క్రీస్తు సేవ చేసి, క్రీస్తు ప్రభువుని సాక్షిగా తన ప్రాణమును ధారపోసి రక్త సాక్షిగా మరణించాడు.
క్రిస్తునాధుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పవిత్ర నగరమైన యెరూషలేమును గూర్చి వింటున్నాం. ఆ యెరూషలేము నగరము ఒక అమూల్యమైన రత్నము వలెను, సూర్యకాంతమణి వలెను. స్ఫటికము వలే స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను అని ఆ యెరూషలేము యొక్క విశిష్టతను వింటున్నాం. పండ్రెండు ద్వారములు. వాటిపై పండ్రెండు మంది దేవదూతలు, ఆ ద్వారములపై పండ్రెండు గోత్రముల పేర్లు వ్రాయబడినవి అని అదే విధంగా ఒక్కొక్క ప్రక్కకు మూడేసి ద్వారములు ఉండెను. తూర్పున మూడు, దక్షిణమున మూడు ఉత్తమున మూడు పశ్చిమమున మూడు అన్ని కలిపి పండెండు ద్వారములు, ఆ నగరపు గోడ 12 శిలలపై నిర్మింపబడినది. ఆ రాళ్లపై క్రీస్తు ప్రభువుని పండ్రెండు మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడి ఉన్నవి..
ప్రియా విశ్వాసులారా 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు, అధికారానికి గుర్తు, పండ్రెండు యిస్రాయేలీయుల తెగలు, పండ్రెండు మంది అపోస్తులులు, పండ్రెండు ద్వారములు, పండ్రెండు పునాదులు ఇక్కడ 12 అంటే దేవుని చిత్తం పరిపూర్ణము అని అర్ధం. ఎంతో మంది ఆ నూతన యెరూషలేములో చేరాలని, ప్రవేశించాలని ప్రయత్నించారు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఆ అందమైన దేవుని రాజ్యంలో చేరాలంటే దేవుని అనుసరించి, మంచి మార్గంలో నడవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము.
ఈనాటి సువిశేష పఠనంలో దేవుడు క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుచున్న నతనయేలును చూసి ఇదిగో కపటము లేని నిజమైం యిస్రాయేలీయుడు అని చెప్పాడు. ఈనాడు మనం వాక్యంలో వింటున్నాము. ఫిలిప్పు ఎప్పుడైతే నతనయేలును కలిసి మేము మెస్సియ్యను కనుగొంటిమి . ఆయన యేసు నజరేతు నివాసి అని చెప్పగానే అక్కడ నుండి మంచి ఏదైనా రాగలదా ? అని నతనయేలు అనగానే వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికాడు.
ప్రియా విశ్వాసులారా మన సంఘలలో మన జీవితాలలో మన కుటుంబాలలో మనం నిజమైన మెస్సియ్యను కనుగొనాలంటే మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి చూసి ఆయన గొప్ప కార్యాలు, మహిమ శాంతిని అనుభవించాలి. క్రీస్తు చెంతకు రావాలి. నతనయేలు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, ఆ దేవుని అనుభవించి, క్రీస్తు ప్రభువునితో బోధకుడా నీవు దేవుని కుమారుడవు యిస్రాయేలు రాజువు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం మన జీవితాలలో, నీ , నా మన అనుభవం ఏమిటి? ఆ నజరేయుడైన యేసును అనుభవిస్తున్నామా! ఆయన దేవుని కుమారుడని, యిస్రాయేలు రాజు అని గుర్తించగలుగుతున్నామా! లేదా ! ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: ప్రేమమయుడవైన దేవా నీవు దేవుని కుమారుడవు, లోక రక్షకుడవు, యిస్రాయేలు రాజువు. మేము నీవద్దకు వచ్చి మిమ్ము ప్రేమిస్తూ, సేవిస్తూ నిన్ను మా జీవితాలలో తెలుసుకొనే భాగ్యం మాకు దయచేయండి. నతనయేలు మిమ్ము తెలుసుకొని, నీ శిష్యుడుగా మారి, నీ వాక్యాన్ని లోకాన బోధించి ఒక గొప్ప పునీతుడుగా మారినట్లు మేము కూడా మారె భాగ్యం మాకు దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40
యెహెఙ్కేలు 37:1-14 మత్తయి 22:34-40
22, ఆగస్టు 2024, గురువారం
యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14
యెహెఙ్కేలు 36:23-28 మత్తయి 22:1-14
యేసు ప్రజలకు మరల ఉపమానరీతిగా ప్రసంగింప ఆరంభించెను. "పరలోక రాజ్యము ఇట్లున్నది : ఓక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరిరండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కాని, వారు వచ్చుటకు నిరాకరించిరి. అందుచే అతడు, ఇదిగో! నా విందు సిద్దపరుపబడినది. ఎద్దులను, క్రొవ్విన దూడలును వధింపబడినవి. అంతయు సిద్ధముగా ఉన్నది. కనుక విందుకు రెండు అని మరియొకమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను. కాని పిలువబడినవారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి యొకడు తన వ్యాపారమునకు వెళ్లెను. తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టిచంపిరి. అపుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హత మార్చి వారి పట్టణమును తగులబెట్టించెను. అంతట, తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది. కాని , నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులుకారు. ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి, కనపడిన వారినందరిని పిలుచుకొనిరండు అని పంపెను. ఆ సేవకులు పురవీధుల లోనికి వెళ్లి మంచి , చేడు తేడా లేక తమ కంటపడిన వారినందరను తీసికొనివచ్చిరి. ఆ కళ్యాణమండపము అతిథులతో నిండెను. అతిధులను చూచుటకు రాజు లోనికి వెళ్లి, వివాహవస్త్రము లేని వానిని ఒకనిని చూచి మిత్రమా! వివాహవస్త్రములేకయే నీవిచటికి ఎట్లు వచ్చితివి? అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించియుండెను. అపుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపల నున్న చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు విలపించుచు పండ్లు కోరుకుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు కాని , ఎన్నుకొనబడినవారు కొందరే."
క్రిస్తునాధుని యందు ప్రియమైన విశ్వాసులారా! ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు. మీరు మీ పాప జీవితముల ద్వారా అనేక జాతుల మధ్య నా మహానామమునకు అపకీర్తి తెచ్చిరి. కాబట్టి నా నామము పవిత్రమైనది అని అన్య జాతులకు తెలియజేస్తాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. నేను పవిత్రుడను అని జనులు తెలుసుకుంటారు. అది మీ ద్వారానే అని ప్రభువు అంటున్నాడు. పవిత్ర జలమును చల్లి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. కాబట్టి ప్రియ విశ్వాసులారా దేవుని పవిత్ర జలంతో మన పాపములను మాలిన్యములను దేవుడు శుద్ధి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాల ద్వారా మనం పవిత్రమైన దేవుని మహా నామమును అపవిత్రం చేస్తున్నాం. దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు. మన తండ్రి పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనందరిలో పరిశుద్ధాత్మను అనగా తన ఆత్మను మనలో ఉంచుతాడు.
దేవుడు అంటున్నాడు, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. మనలో చాలా మంది రాతి గుండెను కలిగి ఉన్నాం. మనలో చాలా మందికి దైవ ప్రేమ లేదు, సోదర ప్రేమలేదు, స్వార్ధం, గర్వం, అసూయ అనేవి ఎక్కువైపోతున్నవి. మనుషుల మధ్య బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే దేవుడంటున్నాడు. మీలో నా ఆత్మను ఉంచి నాఆజ్ఞలను పాటించునట్లు చేయుదును. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే అవి దైవ ప్రేమ సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. నీ దేవుణ్ణి ప్రేమించు నీ పొరుగు వానిని ప్రేమించు ఇవే దేవుని ఆజ్ఞల సారాంశం. ప్రియ విశ్వాసులారా మనందరం దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో నింపబడి పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నించుదాం. అప్పుడు మనము దేవుని ప్రజలం అవుతాము. ఆయన మన ప్రభువు అవుతాడు.
ఈనాటి సువిశేష పఠనములో యేసు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము ఇలా ఉన్నది. అని ఉపమానాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. సిద్ధపరచిన పెండ్లి విందుకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా దేవుడు పరలోక రాజ్యపు విందునకు మనందరిని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఎన్నుకొని ఆహ్వానిస్తున్న, వారు మాత్రం ఆ విందుకు రావడం లేదు. దేవుడు తన సేవకులను పంపి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. అనేక సార్లు దేవుడు తన సేవకులను పంపినప్పటికీ చాల మంది ఆ ఆహ్వానాన్ని అర్ధం చేసుకోలేక ఆ విందుకు రాలేకపోతున్నారు. అదేవిధంగా దేవుడు తన సేవకులను ఈనాడు మనందరి దగ్గరకు పంపిస్తున్నాడు. మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతమందిమి సిద్ధంగా ఉన్నాము, ఆ పరలోక రాజ్యపు విందులో పాల్గొనడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
పిలువబడినవారు ఆహ్వానాన్ని లక్ష్య పెట్టకుండా, అంటే లెక్క చేయకుండా ఉన్నారు. మరి ఈనాడు నీవు నేను మనందరం దేవుని ఆహ్వానాన్ని స్వీకరించుచున్నామా లేదా ఆలోచించండి. లేదా అయోగ్యులుగా మారిపోతున్నామా? నీకు నాకు వివాహ వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను నన్ను చీకటిలోకి త్రోసివేస్తాడు. ఏమిటి వివాహ వస్త్రం అంటే అది మన సిద్ధపాటు, మరియు పవిత్రత. మన జీవితాలలో, మన విశ్వాసపు ప్రయాణంలో ఈ విధమైన సిద్ధపాటు, అవిత్రత లేకపోతే మనం కూడా చీకటిలోనికి త్రోసివేయబడతాం. కాబట్టి విశ్వాసులారా ధ్యానించండి, ఆలోచించండి మనం ఎలా ఉన్నాం. కేవలం పిలువబడిన వారిలా ఉన్నామా లేదా ఎన్నుకొనబడిన వారిలా ఉన్నామా ? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: పవిత్రుడవైన దేవా, నా పాప జీవితము ద్వారా నీ పవిత్ర నామమును అపవిత్రం చేసి నీకు ద్రోహము చేసి ఉన్నాము. మమ్ము క్షమించండి. ప్రభువా మాలో ఉన్న రాతి గుండెను తొలగించండి. మీ ఆత్మతో మమ్ము నింపండి మాంసపు గుండెను నాకు ప్రసాదించండి. మాకు పవిత్రతను, పవిత్ర జీవితమును జీవించే భాగ్యము మాకు దయచేయండి. మేము ఎన్నుకొనబడిన వారిగా ఉండే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
21, ఆగస్టు 2024, బుధవారం
యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16
యెహెఙ్కేలు 34:1-11 మత్తయి 20: 1-16
"పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది: ఒక యజమానుడు తన ద్రాక్షతోటలో పని చేయుటకు పని వారలకై ప్రాతః కాలమున బయలు దేరెను. అతడు రోజునకు ఒక దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్లి అంగడి వీధిలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి,'మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు. న్యాయముగా రావలసిన వేతనమును ఇచ్చెదను' అనెను. వారు అటులనే వెళ్లిరి. తిరిగి పండ్రెండు గంటలకు మరల మధ్యాహ్నం మూడుగంటలకు ఆ యజమానుడు అట్లే మరి కొందరు పని వారిని పంపెను. రమారమి సాయంకాలము ఐదుగంటల సమయమున వెళ్లి, సంత వీధిలో ఇంకను నిలిచియున్నవారిని చూచి , మీరు ఏల రోజంతయు పని పాటులు లేక ఇచట నిలిచియున్నారు? అని ప్రశ్నించెను. మమ్మెవరు కూలికి పిలువలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతట ఆ యజమానుడు అటులైన మీరు కూడ నా ద్రాక్ష తోటలో పనిచేయుటకు వెళ్లుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి, తొలుత వచ్చిన వారి వరకు వారివారి కూలినిమ్ము అనెను. అటులనే సాయంత్రం అయిదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించినవారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కాని, వారుకూడ తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని, యజమానునితో 'పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును, చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగినవారికిని, సమానముగా కూలి నిచ్చితివేమి'? అని గొణుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా! నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసికొనిపొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికిని ఇచ్చుట నా యిష్టము. నా ధనమును నా యిచ్ఛవచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీ కంటగింపుగానున్నదా?'అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటివారగుదురురు" అని యేసు పలికెను.
క్రీస్తు నాధుని యందు ప్రియమైన విశ్వాసులారా ఈనాటి మొదట పఠనంలో దేవుడు తన ప్రవక్తను పంపుతూ యిస్రాయేలు కాపరులను ఖండిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజులను ఖండించు అని తన ప్రవక్తను పంపిస్తున్నాడు. మీకు అనర్ధము తప్పదు అని వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు వారిని అంటే కాపరులను, రాజులను ఖండిస్తున్నాడు అంటే కాపరులు మందను వెదకటం లేదు. అంతే కాకుండా వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని మందను మేపటం లేదు. గొర్రెలను పట్టించుకొనుట లేదు. అందుకు దేవుడు అంటున్నాడు నేను మీ నుండి గొఱ్ఱెలను కాపాడుదును. నేనే నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను అని తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు.
ప్రియ విశ్వాసులారా ఇక్కడ కాపరులు అంటే దైవ సేవ చేస్తున్న గురువులు, దైవాంకితులు దేవుని చేత ఎన్నుకోనబడి దైవసేవ చేసేవారు అదే విధంగా గొర్రెలు అంటే ప్రజలు దేవుడు గురువులను కాపరులుగా తన మందయినా ప్రజలను మంచి మార్గములో నడిపించమని ఎన్నుకొంటే వారు మాత్రం వారు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు. అదే దేవుని ఆవేదన. దైవ ప్రజలను మేపుట లేదు . దేవుని ప్రజలు పాపపు మార్గంలో పడి కొట్టుమిట్టాడుతుంటే వారిని చూసి కూడా పట్టించుకోవడం లేదు. వారు అనేక సమస్యలతో , ఇబ్బందులతో, కష్టాలతో కన్నీళ్లతో గాయపడి ఉన్నప్పుడు వారికి దేవుని వాక్కుతో కట్టు కట్టడం లేదు. ప్రక్కకు తప్పుకొనిన వారు అంటే చేదు అలవాటుల వలన, చేడు క్రియలను, చేడు ఆలోచనల ద్వారా విశ్వాసులు అవిశ్వాసులుగా మారి ప్రక్కకు తప్పుకొని పోతున్నారు. అది చూసి కూడా కాపరులు వారిని తిరిగి మందలోనికి నడిపించలేక పోతున్నారు. అంతేకాకుండా వారి పట్ల కఠినముగా ప్రవర్తించుచున్నారు.
ఇదే ఈనాటి సమాజంలోకూడా జరుగుతుంది. కాపరులు తమ కడుపునింపుకుంటున్నారు. తమకు అప్పగించబడిన విశ్వాసులను అస్సలు పట్టించుకోవండ లేదు. వారిని కని పెట్టుకొని ఉండటం లేదు. వారు తాము మంచి మార్గంలో నడువకుండా మంచి మార్గంలో నడిచే విశ్వాసులను తమ మాటల ద్వారా అసత్యపు బోధల ద్వారా చెల్లా చెదురు చేస్తున్నారు. ఎవరైన చేడు మార్గంలో పోతుంటే వారిని సన్మార్గంలో నడిపించలేకపోతున్నారు. వారి గాయాలను మాన్పకుండా వారు తమ విశ్వాసులను అనేక విధములుగా గాయ పరుస్తున్నారు. విశ్వాసుల పట్ల మృదువుగా ప్రవర్తించడం లేదు. ఇది నిజమా ? కాదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ఈనాటి సువిశేష పఠనములో మనం దేవుని యొక్క ఉదారతను తెలుసుకుంటున్నాం. దేవుడు పరలోక రాజ్యంను ద్రాక్షతోట, కూలీల పోలికలతో వివరించాడు. అనేక సమయాలలో అనేక మందిని దేవుడు తన తోటకు పని నిమిత్తము పంపుతున్నారు. దేవుడు మనందరిని తన రాజ్య విస్తరణకు పనివారిగా ఎన్నుకుంటున్నారు. అందరి పట్ల ఉదారత, సమానత్వాన్ని దేవుడు చూపిస్తున్నారు. దేవునికి అందరు అర్హులే. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు అంటే అర్ధం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనలను దీవించి యోగ్యులును చేస్తాడు, మనం చివరి వారిగా ఉన్న మనలను మొదటి వారీగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని రాజ్యాల విస్తారణకై శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని దయను పొందుటకు సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రార్ధన: దేవా మమ్ము అందరిని ఒక కాపరులుగా ఎన్నుకున్నావు. తండ్రిగా, తల్లిగా , బిడ్డగా విశ్వాసిగా మేము కూడా కాపరులుగా జీవించడానికి శక్తిని దయ చేయండి. మాకు అప్పగించిన , మా బిడ్డలను మా కుటుంబాలను , సంఘస్తులను మంచి మార్గంలో నడిపించడానికి శక్తిని దయ చేయండి. మమ్ము మంచి కాపరులుగా మార్చండి. నీవలె ఉదారత కలిగి అందరిని ప్రేమించి జీవించే భాగ్యం దయచేయండి. ఆమెన్
ఫా. సురేష్ కొలకలూరి OCD
19, ఆగస్టు 2024, సోమవారం
యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30
యెహెఙ్కేలు 28:1-10, మత్తయి 19:23-30
మత్తయి 19: 16-22
మత్తయి 19: 16-22
అంతట ఒక యువకుడు యేసుని సమీపించి, "బోధకుడా! నిత్యజీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పనియేమి?" అని ప్రశ్నించెను. "మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు దేవుడు ఒక్కడే. నిత్యజీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము" అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి?" అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, "నరహత్య చేయకుము. వ్యభిచరింపకుము. దొంగిలింపకుము. అబద్ధసాక్ష్యములు పలుకకుము. తల్లితండ్రులను గౌరవింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము" అనెను. అంతట అతడు యేసుతో "ఇవన్నియు ఆచరించుచుంటిని. ఇంకను నాకు లోటు ఏమి?" అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము" అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపదగలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్లిపోయెను.
ధ్యానము : నిత్య జీవము పొందుటకు నేను చేయ వలసిన మంచి పని ఏమిటి ప్రభువా? అని అడిగిన ధనికుడైన యువకునికి, దేవుడు మాత్రమే మంచి వాడు అని ప్రభువు తేటతెల్లం చేస్తున్నారు. ఎందుకు దేవుడు ఒక్కడే మంచివాడు? అంటే ఆయన ఎప్పుడు మంచినే చేస్తాడు, మానవుని వలే దురాలోచనలు, చేడు పనులు, హత్యలు, దొంగతనాలు, అబద్దాలు, మోసాలు, కపటము, స్వార్ధం, లేక మానవునిలో కనపడే ఏ చేడు భావన దేవునిలో ఉండదు. ఆయన సకల సద్గుణాల నిధి. ఇతరుల ఉన్నతిని కోరువాడు. ఆయన ప్రేమామయుడు. పునీత పౌలు, యోహానులు చెప్పినట్లు ఆయన ప్రేమ. ప్రేమ సమస్తమును భరిస్తుంది. కాని మానవుడు తనకు వ్యతిరేకముగా ఏదైనా జరిగితే ఓర్చుకోలేడు. దేవుడు ఈ ఆజ్ఞలు మనకు ఇవ్వడం వలన మనం కూడా అయన వలే ఉండాలని కోరుతున్నాడు. కేవలం మానవ స్వభావం కాక దైవిక స్వభావం మనలో ఉండాలని కోరుకుంటున్నారు.
యేసు ప్రభువు ఆ యువకునితో నిత్య జీవం పొందుటకు దైవాజ్ఞలను ఆచరింపమని చెబుతున్నారు. యువకునికి ఉన్న కోరిక నిత్య జీవం పొందాలని. యువకుడు అడిగినది యేసు ప్రభువును. కేవలం యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. కాని నిత్య జీవం ఇచ్చే ప్రభువు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెబుతున్నాడు. దేవుని ఆజ్ఞలు మనలను నిత్య జీవం పొందుటకు అర్హులను చేస్తాయి. దేవుని ఆజ్ఞలు ఏమి? అని యువకుడు ప్రభువును అడుగుతున్నాడు. యేసు ప్రభువు ఆ యువకునికి నిత్య జీవితానికి మనలను అర్హులను చేసే దేవుని ఆజ్ఞలను వివరిస్తున్నాడు. అవి ఏమిటి అంటే నరహత్య చేయకుండా ఉండటం, వ్యభిచరించకుండా ఉండటం, దొంకిలింపకుండా ఉండటం, అబద్ద సాక్ష్యములు చెప్పకుండా ఉండటం, తల్లితండ్రులను గౌరవించడం, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం ఇవి ఒక వ్యక్తిని నిత్యజీవం పొందేలా చేస్తాయి. ఇవి కేవలం మనలను నిత్య జీవం పొందేలానే కాక దేవుని మనస్సును కలిగి ఉండేలా చేస్తాయి. మనలను దేవునికి ఇష్టమైన వారిగా చేస్తాయి.
ఆ యువకుడు ఈ ఆజ్ఞలన్నిటిని చిన్నప్పటి నుండి పాటిస్తున్నాను అని చెబుతున్నాడు. కాని ఆ యువకునిలో ఎదో ఓక లోపం ఉన్నది అని ఆ యువకునికి అనిపిస్తుంది. ఎందుకు ఆ యువకుడు అలా అనుకుంటున్నాడు అంటే నిత్యజీవాన్ని ఇచ్చే ఈ ఆజ్ఞలను ఆ యువకుడు పరిపూర్తిగా పాటించి ఉండడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలలో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని చెబుతున్నాయి. ఈ యువకుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని అన్నప్పటికీ, ప్రభువు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అని అంటున్నాడు. అంటే ఈ యువకుడు తనతో పాటు ఉన్నటువంటి పేదలను పట్టించుకోలేదు. ఈ లోపం ఈ యువకునిలో ఉన్నది. అదే విధంగా తన ఆస్తిని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు, తన ఆస్తిని నిత్య జీవం కంటే ఎక్కువగా ఆ యువకుడు ప్రేమించాడు. కనుకనే ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. తన ఆస్తిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుటలేదు. యేసు ప్రభువు పరలోకంలో ఆస్తిని కూడపెట్టుకొనే మార్గం చూపిన కేవలం ఈలోకం ఆస్తుల మీదనే ఆ యువకుడు ధ్యాస పెట్టాడు.
దేవునితో సంభాషణ: ప్రభువా నేను కూడా యువకుని వలే నిత్య జీవం పొందాలనే ఆశ కలిగి ఉన్నాను. మీ గురించి విన్నప్పుడు, మీ గురించి చదివినప్పుడు, మీరు మాత్రమే ఈ నిత్య జీవం ఇవ్వగలరని తెలుసుకున్నాను. మీరు మాత్రమే ఇవ్వగలిగే ఆ నిత్య జీవం పొందాలని అనుకుంటాను. కాని ఆ నిత్య జీవం పొందుటకు నన్ను అర్హున్నీ చేసేటువంటి మీ అజ్ఞాలను నేను పాటించుటలో అనేక సార్లు విఫలం చెందుతున్నాను. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించుటలో విఫలం చెందాను. ఇతరులు గొప్పగా ఉండే ఓర్చుకోలేకపోయాను. అనేకసార్లు మీ అజ్ఞలను పాటించుటలో పూర్తిగా విఫలం అయ్యిపోయాను. నన్ను నేను ప్రేమించాను, అభిమానించాను, వృద్ధిలోకి రావాలని కాంక్షించాను, కాని ఇతరులను అలా చూడలేక పోయాను. నిన్ను అనుసరించాలని, నీ వలె ఉండాలని, నిత్య జీవం పొందాలని అనుకుంటున్నాను. ఈ లోక విషయాలు, ఆస్తుల మీదనే నా మనసును కేంద్రీకరించాను కాని నీ వలె తండ్రి చిత్తము మీద నా మనస్సును పెట్టలేక పోతున్నాను.
ప్రార్ధన: ప్రేమమయుడవైన ప్రభువా! మీరు నిత్య జీవం పొందుటకు మమ్ములను అర్హులను చేయుటకు మేము చేయవలసిన క్రియలను మాకు తెలియజేస్తున్నారు. మీరు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటిని పాటించుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేయండి. పరలోకంలో ఆస్తిని కూడపెట్టుటకు ఈ లోకంలో ఏమి కోల్పోవుటకైనను సిద్దపడే మనస్సును మాకు ఇవ్వండి. నన్ను నేను ప్రేమించుకొనునట్లు ఇతరులను ప్రేమించుటకు, మీవలె సకల సుగుణాలు కలిగి ఉండుటకు కావలసిన అనుగ్రహాలు మాకు దయచేసి, మేము తండ్రి వలే పరిపూర్ణులమగుటకు కావలసిన అనుగ్రహములు దయచేయండి. ఆమెన్
17, ఆగస్టు 2024, శనివారం
20 వ సామాన్య ఆదివారం
20 వ సామాన్య ఆదివారం
సామెతల గ్రంధం 9:1-6 ఎఫెసీ 5: 15-20 యోహాను 6: 51-58
ఈనాటి మొదటి పఠనంలో విజ్ఞానమను స్త్రీ మూర్తి ప్రజలను "రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము. జ్ఞానము లేని వారు ఇచ్చటకు రెండు అని ఆహ్వానిస్తుంది. మూర్ఖత్వమును విడనాడి బ్రతుకుడు. విజ్ఞాన పథమున నడువుడు అని మనం మొదటి పఠనంలో విటున్నాం. ప్రియ విశ్వాసులారా జ్ఞానము లేని వారు ఇచటకు రెండు అని విజ్ఞానమను స్త్రీ మూర్తి పిలిచినట్లే దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. మనలను దేవుని వాక్కు అనే భోజనమును ఆరగించమని ఆహ్వానిస్తున్నారు. మానవుడు కేవలం, రొట్టె వలెనే కాక దేవుని నోటి నుండి వచ్చు వాక్కు వలన జీవించును. ఇది అక్షరాల సత్యం. కానీ చాలా మంది ఇంకా మూర్ఖత్వంలోనే జీవిస్తున్నారు. అజ్ఞానములోనే ఉండిపోతున్నారు. నా యొద్దకు రెండు అని పిలిచిన దేవుని మాటను వినలేక పోతున్నారు. దేవుని విజ్ఞాన మార్గంలో నడవమని ఆహ్వానిస్తుంది. మనము జ్ఞానము కలిగిన వారిగా జీవించి విజ్ఞాన పథంలో జీవించుదాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారము నేనే. అదే విధంగా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నాశరీరమే అని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు.
అదే విధంగా నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువారు నిత్యజీవము పొందును. నేను వారి యందు వారు నాయందు ఉండును. నేను తండ్రి మూలమున జీవించునట్లే నన్ను భుజించువాడు నా మూలమున ఎల్లప్పుడును జీవించును. ఇది గొప్ప భాగ్యం మానవులమైన మనందరికీ.
కాబట్టి ప్రియ విశ్వాసులారా మనం నిత్య జీవం పొందాలంటే , మనం మనము దేవుని యందు ఉండాలంటే దేవుని శరీర రక్తాలను నిత్యం స్వికరించాలి. మరి క్రీస్తు ప్రభువుని శరీర రక్తలను స్వీకరించాలంటే పరిశుద్ధతతో జీవించాలి. దేవుని చిత్తాను సారం నీవు నేను మనందరం ఆ ప్రభుని చిత్తం తెలుసుకొని జీవించాలి. పవిత్రతతో నింపబడాలి.
మనం ఏమి చేయాలంటే? దేవుని పిలుపును , ఆహ్వానాన్ని విని దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానమును, జ్ఞాన ఫలములను పొంది దేవుని వాక్కుతోను శరీర రక్తములతోను నింపబడాలి. మన మూర్ఖత్వాన్ని తొలగించమని ఆ దేవుని జ్ఞానము కొరకు ప్రార్ధించాలి. నిత్య జీవం, పొందాలంటే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని విడనాడి దేవుని త్రోవలో నడవాలి. దేవునితో నిత్యం కలకాలం జీవించడానికి ప్రయత్నించుదాం.
ప్రార్ధన: ప్రేమ మయుడైన దేవా మేము ముర్ఖులం, మా మూర్ఖత్వంలో, అజ్ఞానంలో జీవిస్తున్నాం. నీ జ్ఞానమును, జ్ఞానవరములను పవిత్రత్మను మాపై కుమ్మరించి విజ్ఞానముతో నింపుము, నిత్యం నీ త్రోవలో నడుస్తూ నిత్య జీవం పొందే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
ఫా. సురేష్ కొలకలూరి OCD
యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15
యెహెఙ్కేలు 18:1-10. 13,30-32 మత్తయి 19:13-15
ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులుచాచి ప్రార్ధింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా, శిష్యులు వారిని ఆటంకపరచిరి. "చిన్న బిడ్డలను నాయొద్దకు రానిండు. వారలను ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే పరలోక రాజ్యము" అని పలికిరి, వారి మీద చేతులుంచి యేసు అచట నుండి వెడలిపోయెను.
ప్రియమైన మిత్రులారా ఈనాటి మొదటి పఠనం యెహెఙ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అంటున్నాడు. ఎవ్వరు చేసిన పాపములకు వారే శిక్షను అనుభవిస్తారు అని దేవుడు చెప్పిన సందేశాన్ని వారికి వినిపిస్తున్నాడు . అదే విధంగా సత్పురుషుడు చిత్తశుద్ధితో దేవుని చట్టాలను విధులను పాటించును కనుక అతడు కాలకాలము బ్రతుకును అని దేవుడు పలుకుచున్నాడు. ఎవరైతే న్యాయపరులుగాను, ధర్మ పరులుగాను, జీవిస్తారో వారు దేవుని కృపను పొందుతారని వింటున్నాం. అదే విధంగా ఎవరైతే దుష్ట కార్యాలను పాల్పడుతారో వారు ఖచ్చితముగా చచ్చును. వారి చావునకు వారే బాధ్యులు, అని దేవుడు వారితో చెబుతూ ఎవరు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగదు అని అంటున్నాడు. మన నుండి మన దేవుడు కోరుకొనినది హృదయ పరివర్తన చెంది, పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు అంటున్నాడు.
ప్రియ విశ్వాసులారా దేవుడు మనలను మన పాపపు క్రియల నుండి పాపపు ఆలోచనలనుండి మారు మనస్సు పొంది, మన పాపముల నుండి వైదొలగాలని ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మనం పాపంలోనే, పాపం చేస్తూ మరణించడం దేవునికి అసలు ఇష్టం లేదు అదేవిధంగా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మీ మీ క్రియలను బట్టి, మీరు శిక్షను పొందుతారు అని చెబుతున్నాడు. మరి మనము ఎలాంటి క్రియలు చేస్తున్నాము. ఎలాంటి పనులు చేస్తున్నాము ఆలోచించండి. మనం చిత్త శుద్దితో న్యాయంగా, ధర్మంగా దేవుని ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాని మన మనలో చాలా మంది దుష్ట బుద్దితో, దుష్ట కార్యములకు పాల్పడుతున్నాం. దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. మరి ఈరోజు మన నుండి దేవుడు ఏమి అడుగుతున్నాడు అంటే మీ పాత పాపపు జీవితమును విడిచి పెట్టి నూత్న మనసును, నూత్న హృదయమును పొందుకోండి అంటున్నాడు. మనం మన పాపపు , చీకటి , చేడు, దుష్ట కార్యాలను వదలి నూత్న జీవితము పొందడానికి సిద్ధముగా ఉన్నామా? లేదా? ఇంకా పాపములోనే ఉండి జీవిస్తూ, పాపములో మరణిస్తామో ఆలోచించండి. ఇంకా పాపములోనే ఉండి మనము చనిపోయినట్లయితే మనం దేవుని సంతోష పెట్టినవారము కాదు. మనము దేవుని దుఃఖ పరిచినవారము అవుతాం. కాబట్టి మన జీవితాలు దేవుని చిత్తానుసారాం జీవించడానికి మంచిగా జీవించడానికి ప్రయత్నించుదాం.
ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. ఎప్పుడైతె శిష్యులు యేసు వద్దకు వచ్చి త్మమ బిడ్డలను దీవింపమని అడిగిన వారిని ఆటంకపరచడం చూశాడో అప్పుడు శిష్యులతో చిన్న బిడ్డలను నాయొద్దకు రానివ్వండి. వారిని ఆటంకపరచకండి అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దీవించాడు. ప్రియ విశ్వాసులారా మనం మన మనస్సు నందు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న బిడ్డలలో గర్వం, స్వార్ధం, అహంకారం, కోపం, క్రోధం, మొహం, దుష్టత్వం ఇలాంటివి ఏవి వారికి ఉండవు. వారు నిర్మలంగా, పరిశుద్ధంగా, ప్రేమ, మంచి మనస్సుతో ఇతరులను గౌరవిస్తూ వారి తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రియ విశ్వాసులారా మరి మనం నిర్మలమైన , పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సులతో ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యాన్ని పొందగలం. కాబట్టి దేవునికి ప్రార్థిస్తే చిన్నపిల్లల మనస్తత్వం పొందుటకు ప్రయత్నించుదాం.
ప్రార్ధన : పరిశుద్దుడైన దేవా మేము మా పాపపు ఆలోచనలతో పాపము క్రియలు చేస్తూ మా పాపాలలోజీవిస్తున్నాం. దయగల దేవా నీవు అంటున్నాము. పాపాత్ములు మరణించుటలో నీకు సంతోషం లేదని, ప్రభువా నాకు పాప మన్నింపును దయ చేయండి. నా దుష్ట క్రియల నుండి వైదొలగడానికి, శక్తిని బలాన్ని నాకు దయచేయండి. మంచిగా జీవిస్తూ నీ ఆజ్ఞలను పాటించే నూత్న హృదయాన్ని నాకు దయచేయండి. నిన్ను సంతోష పెట్టె బిడ్డగా నేను జీవించేలాగా నన్ను మార్చుము తండ్రి. ఆమెన్.
ఫా . సురేష్ కొలకలూరి OCD
మార్కు 6 : 14 – 29
February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...