21, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం

ఆగమన కాల నాలుగవ సామాన్య ఆదివారం 
మీకా 5:1-4 హెబ్రీ 10: 5-10 లూకా1:39-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ఏసుప్రభు యొక్క ఆగమనం కోసం ఎదురు చూసే వారందరిలో ఆయన యొక్క జన్మం జరుగుతుంది అనే అంశము గురించి తెలియజేయు చున్నవి. దేవుని ప్రణాళికకు సహకరిస్తూ ఆ ప్రణాళికను వ్యక్తిగత జీవితంలో అమలు చేస్తూ జీవించే ప్రతి ఒక్కరిలో దేవుడు జన్మిస్తారు.  ప్రభువు యొక్క జన్మదినం త్వరగా రాబోవుచున్నది కాబట్టి ఆయన రాక కొరకు ఆధ్యాత్మికంగా తయారవ్వాలి.
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు మీకా ప్రవక్త ద్వారా చేసినటువంటి వాగ్దానములను తప్పనిసరిగా నెరవేరుస్తారు అనే విషయమును తెలుపుచున్నారు. బెత్లెహేము నుండి రక్షకుడు ఉదయిస్తాడు అని ప్రవక్త తెలియజేశారు. దీనిలో ఒక అర్థము ఉన్నది. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు బెత్లహేముని ఎన్నుకున్నారు రక్షకుని జన్మస్థలంగా? మొదటిగా బెత్లహేము అనగా హౌస్ ఆఫ్  ద బ్రెడ్ అని అదేవిధంగా దేవుని యొక్క నిలయము అని అర్థం కావున అక్కడినుండి రక్షకుడు జన్మిస్తారు. బెత్లహేము లేవీయులకు కేంద్ర స్థానంగా ఉన్నది. బెత్లహేము దావీదు రాజు యొక్క జన్మస్థలం. ఇశ్రాయేలును పరిపాలించే పాలకుడు మరియు దేవుడు పంపబోయే వ్యక్తి క్రీస్తు ప్రభువే ఎందుకంటే దేవుడు మరియమ్మకు ప్రత్యక్షమైన సమయంలో తనతో పలికిన మాటలు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అన్నారు.( లూకా 1:33). దేవుడు చిన్నదైనటువంటి బెత్లహేమును ఎన్నుకొని ఆ ప్రదేశమునకు రక్షకుని జన్మస్థలమును అర్థము  ఇస్తున్నారు. ఎఫ్రాతా అనేది ఒక చిన్న గ్రామం దానికి పెద్ద గుర్తింపులేదు అయితే దేవుడు మాత్రము ఆ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ఒక గొప్ప ప్రాంతమును ఎన్నుకొనక కేవలం గుర్తింపు లేని అతి సామాన్యమైన ప్రాంతమున ఎన్నుకొని దానికి ఒక గొప్పదైన అర్థం ఇస్తున్నారు. మన జీవితంలో ప్రముఖమైన స్థలంలో జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మాత్రం ఒక చిన్నదైనటువంటి గుర్తింపు లేని స్థలము ఎన్నుకొని అక్కడ జన్మిస్తున్నారు.
దేవుడు అల్పులైనటువంటి చేపలు పట్టే శిష్యులను ఎన్నుకొని వారిని గొప్పవారిగా తీర్చిదిద్దారు సామాన్యురాలు అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని దేవుని తల్లిగా చేశారు కాబట్టి ప్రభువు అల్పమైనటువంటి ప్రాంతంలో జన్మించి ఆ ప్రాంతములకే కొత్తదైన అర్థం ఇస్తున్నారు ఈ క్రిస్మస్ కాలమున అల్పుల మైనటువంటి మనలో జన్మించి మన యొక్క జీవితమునకు కూడా కొత్త అర్థమును దయ చేస్తారు. 
ఈనాటి రెండవ పఠణంలో ఏసు క్రీస్తు ప్రభువు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అని తెలియజేశారు. 
ఈనాటి సువిశేష భాగములో మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించుట గురించి వింటున్నాం దేవదూత వద్ద నుండి శుభ వచనము విన్న మరియ మాత వెంటనే తన చుట్టమైన ఎలిజబెతమ్మను కలుసుకొనుటకు వెళ్ళుచున్నారు. దాదాపుగా నాలుగు రోజుల ప్రయాణం చేసి విసుగు చెందకుండా నజరేతు నుండి యూదయా పట్టణంలో ఉన్న  అయిన్ కరీము అనే ప్రాంతమునకు మరియ తల్లి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి  ఎలిజబెత్తమ్మను కలుసుకున్నారు. ఈ యొక్క సువిశేష పట్టణములో మనము గ్రహించవలసిన కొన్ని అంశములు.
1. అడగక మునుపే సహాయము చేయుట. మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ సహాయము చేయమని పిలవలేదు కానీ మరియమ్మ గారే ఎలిజబెత్ పరిస్థితిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయుటకు వెళ్లారు. కానా పల్లెలో కూడా మరియ తల్లియే చొరవ తీసుకొని వారు అడగకమునుపే సహాయం చేశారు. మన క్రైస్తవ జీవితంలో కూడా చాలా సందర్భంలో మనం ఇతరులు మనల్ని అడగాలనుకుంటాం అప్పుడే సహాయం చేస్తాం కానీ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటంటే అడగకపోయినా సహాయం చేసే గుణం అని మనం నేర్చుకోవాలి. 
2. ఆనందమును పంచుకొనుట. మరియమ్మ గారు దేవునికి తల్లిగా పిలవబడిన సమయంలో తన యొక్క ఆనందమును తన చుట్టమైన ఎలిజబెత్తమ్మతో పంచుకొనుటకు ఆనందముతో పరిగెడుచున్నారు. దైవ అనుభూతిని కలిగిన మరియమ్మ గారు ఇంకొక వ్యక్తిని సందర్శిస్తూ తన దైవ అనుభూతిని మరియు ఆనందమును ఇతరులకు ఇస్తున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇతరులకు ఆనందం నివ్వటానికి ప్రయత్నించాలి. 
3. మరియమ్మ గారి యొక్క వినయం. మరియమ్మ గారు కూడా గర్భము ధరించి ఉన్నారు తాను కూడా ఇతరుల యొక్క సహాయం కావలసిన వారే కానీ తాను తన యొక్క సహాయం చూసుకోకుండా ఇతరులకు సహాయం చేయాలని తనను తాను తగ్గించుకొని ఎలిజబెత్ దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి మరియమ్మ గారు దేవునికి తల్లిగా ఉండబోతున్నారు ఎలిజబెతమ్మ ప్రవక్తకు తల్లిగా ఉండబోతున్నారు ఈ సందర్భంలో మరియమ్మ గారి దేవుని తల్లి అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకొని సేవాభావంతో ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్లి సేవ చేస్తున్నారు.
4. ఎలిజబెతమ్మ తన వయసులో చిన్నదైనా మరియమ్మ గారికి నమస్కరించి నా దేవుని యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను అని మరియమ్మ గారిని గౌరవించి నమస్కరించినది మనం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనమును మంచితనము చూసినప్పుడు వారిని కూడా గౌరవించాలి. జీవం పోసిన దేవునికి జీవమునిచ్చుటకు నిన్ను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారని ఎలిజబెత్తమ్మ మరియమ్మ గారిని గౌరవించారు.
ఈనాటి ఈ యొక్క దివ్యగంధ పఠణముల ద్వారా మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తూ జీవించాలి. మన యొక్క జీవితంలో ప్రభువు కొరకు తయారు చేసుకోవాలి. మరియ తల్లి మరియు ఎలిజబెతమ్మవలే ఇతరులకు సహాయం చేస్తూ, ప్రేమను పంచుతూ జీవించాలి. 
Fr. Bala Yesu OCD

14, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాల మూడవ ఆదివారం

ఆగమన కాల మూడవ ఆదివారం 
జెఫాన్య 3:14-18, ఫిలిప్పీ 4: 4-7 లూకా 3:10-18
ఈనాటి ఆదివారమును తల్లి శ్రీ సభ "ఆనందించు"(Gaudete Sunday)ఆదివారంగా పిలుస్తున్నది ఎందుకనగా ప్రభువు యొక్క జన్మము ఆసన్నమవుతున్నది కాబట్టి మనము సంతోషించాలి. ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు మనకు బోధించుచున్నటువంటి అంశము కూడా ఆనందించుట గురించియే. ఎందుకు మనము ఆనందించాలి అనే అంశమును ధ్యానించినట్లయితే మనకు అనేక విషయములు జ్ఞాపకం వస్తాయి;
- మనలను రక్షించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనతో ఉండే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
-  మనల్ని ప్రేమించే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి.
- మనల్ని క్షమించే దేవుడు వస్తున్నాడు కాబట్టి సంతోషించాలి
- మనలను పరలోకం చేర్చే దేవుడు రాబోతున్నారు కాబట్టి ఆనందించాలి ఈ విధంగా దేవుని యొక్క అనేక అంశములను గురించి మనము ఆనందించాలి.
ఏ విధముగానయితే మనము ప్రార్ధించినప్పుడు దేవుడు మనకు దయచేసినప్పుడు మనం ఆనందిస్తామో, అదేవిధంగా చిన్నపిల్లలు తమకు నచ్చిన దానిని వారు పొందుతున్నప్పుడు ఆనందిస్తారు మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మనలను తండ్రి వైపుకు నడిపించే ప్రభువు రాబోతున్నందుకు మనం కూడా సంతోషించాలి.
ఈనాటి మొదటి పఠణంలో జెఫన్యా ప్రవక్త ఇశ్రాయేలును, యెరుషలేమును సంతోషించమని తెలుపుచున్నారు. ప్రభువు వారి మీద ఉన్నటువంటి నిందలను తొలగించినందుకుగాను అదే విధముగా వారిని శత్రువుల యొక్క భారి నుండి కాపాడినందుకు సంతోషించమని తెలుపుతున్నారు. దేవుడు వారి యొక్క మధ్య ఉన్నందుకు, దేవుడు వారిని క్రింద పడనివ్వకుండా చూసుకుంటున్నందుకు అదే విధముగా వారికి నూతన జీవితమున వసుగుతున్నందుకుగాను ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, యెరుషలేము వాసులను సంతోషించమని తెలుపుచున్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు పంపబడిన సమయంలో వారి నుండి స్వేచ్ఛ, ఆనందం తీసివేయబడినది ఇప్పుడు మరొకసారి దేవుడు వారిని విముక్తులను చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి ఆనందమును దయచేస్తున్నారు అందుకే ప్రవక్త ఆనందించండి అని తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో కూడా పునీత పౌలు గారు ప్రభువు నందు ఆనందించండి మహా ఆనందపడండి అని పలుకుతున్నారు. ప్రభువు యొక్క రాకడ కొరకై విచారింపక హృదయపూర్వకంగా ప్రార్థించమని పౌలు గారు తెలిపారు. పౌలు గారు ఫిలిప్ప ప్రజలకు దేవుని వాక్యము ప్రకటించు సందర్భంలో పరిసయ్యుల వలన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఫిలిప్పు ప్రజలను కూడా వారి జీవితంలో ఎదురయ్యే శ్రమలకు చింతింపక దేవునియందు నమ్మకంతో  వారిని హృదయపూర్వకంగా ప్రార్ధించమంటున్నారు వారి శ్రమలు కొద్ది కాలమే అంటున్నారు. ప్రభువు వస్తారు కావున ఆనందించమని అదే విధంగా మహా ఆనందంతో ఉండమని తెలుపుచున్నారు.
ఈనాటి సువిశేష భాగములో బప్తిస్మ యోహాను గారి మాటలు విన్న ప్రజలు వెంటనే హృదయ పరివర్తనమునకు చెందిన క్రియలను చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఎవరైతే రెండు అంగీలను కలిగి ఉన్నారో వారు లేని వారికి ఒకటి ఇమ్మని తెలుపుతున్నారు అదేవిధంగా భోజన పదార్థములు కలిగిన వారు లేనివారికి ఇవ్వమని తెలుపుతున్నారు. ఈ మాటలు యొక్క సారాంశం ఏమిటంటే దేవుడు ఇచ్చిన దానిని ఉదారంగా ఇతరులతో పంచుకుని జీవించమని యోహాను గారు తెలుపుతున్నారు. అదేవిధంగా సుంకరులను అధిక సుంకమ వసూలు చేయవద్దంటున్నారు, అలాగే రక్షక భటులు వచ్చి అడిగినప్పుడు ఎవరికి కూడా హాని చేయకుండా న్యాయముగా వారిపట్ల ప్రవర్తించమని బప్తిస్మ  యోహాను గారు తెలిపారు. వాస్తవానికి ఈ మూడు అంశాలు కూడా సంతోషించదగినటువంటి అంశములే ఎందుకంటే వారు హృదయ పరివర్తనము చెంది ఇతరులకు సంతోషించే విధంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యోహాను గారు వారిని హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలి రమ్మంటున్నారో వెంటనే వారిలో ఉన్న పాపమును గ్రహించి  మెస్సయ్యాను స్వీకరించుట కొరకై తగినటువంటి క్రియలు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి, మీలో పాపము చేయని వ్యక్తి ఈమె మీద మొదటి రాయిని వేయమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ వారిలో ఉన్న పాపమును గ్రహించి వెంటనే తిరిగి వెళ్ళారు. ఈ యొక్క సువిషేశ భాగములో వున్న వ్యక్తులు కూడా వారి పాపపు జీవితమును సరి చేసుకొనుటకు సిద్ధపడుతున్నారు దాని వలన ఈ సమాజము కూడా సంతోషిస్తూ ఉన్నది. ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే నేను ఇతరులకు సంతోషిస్తున్నానా?. నా వలన నలుగురు సంతోషపడుతున్నారా?. నా రక్షకుని రాకడ కొరకు ఎదురుచూస్తున్నానా? నేను సంతోషంగా జీవిస్తున్నా? అని పరిశీలన చేసుకొని జీవించాలి.
మనం ఆనందంగా ఉండుట కొరకై ప్రభువు వస్తున్నారు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆనందంగా జీవించడానికి పాపము లేకుండా పుణ్య క్రియలు చేస్తూ జీవిద్దాం. 
Fr. Bala Yesu OCD

7, డిసెంబర్ 2024, శనివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం

ఆగమన కాలము 2 వ ఆదివారం 
బారుకు 5:1-9, ఫిలిప్పీ 1:4-6, 8-11, లూకా 3:1-6
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని కొరకు మార్గమును సిద్ధం చేయుటను గురించి తెలియజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆగమన కాలంలో రెండవ మరియు మూడవ ఆదివారములో బప్తిస్మ యోహాను సందేశమును వింటుంటాం. దేవుని యొక్క రాకడ కొరకై మనందరం కూడా మన జీవితంలో మార్గమును సిద్ధము చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణమునకు ఒక మార్గము అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే మార్గము లేనిదే ప్రయాణము సక్రమంగా జరగదు, గమ్యమును చేరలేము. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత్మ భూమికి నడిచే సమయములో దేవుడే స్వయముగా వారికి మార్గ సూపరిగా ఉండి వారిని నడిపించారు. మార్గము లేని జీవితము గమ్యము చేరటము కష్టం.
ఈనాటి మొదటి పఠణంలో యావే దేవుడు స్వయంగా తన ప్రజల కొరకు బాబిలోనియా నుండి యెరుషలేమునకు మార్గమును సిద్ధం చేస్తారని తెలుపుతున్నారు కనుక బారుకు ప్రవక్త దుఃఖించే ఇశ్రాయేలు ప్రజలను సంతోషించమని తెలుపుచున్నారు. బారుకు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను దేవుని చెంతకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క బానిసత్వం ముగిసిన తర్వాత తిరిగి దేవుని చెంతకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆగమన కాలంలో మనందరం కూడా మన యొక్క పాపపు జీవితమును వదిలి, దేవుని చెంతకు తిరిగి రావాలి అదే ప్రభువు కోరుకుంటున్నారు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజల కొరకై తానే స్వయంగా మార్గమును సిద్ధం చేస్తున్నారు లోయలు పుడ్చుతున్నారు. ప్రభువు తన ప్రజలకు ఒక మంచి మార్గమును ఏర్పరిచి వారిని సంతోషంగా ఉండులాగా చేస్తారని బారుకు ప్రవక్త తెలియజేశారు.
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులను దేవుని యొక్క రాకడ కొరకై సంసిద్ధత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రార్థించుకొనమని తెలియజేస్తున్నారు.
ఈనాటి సువిశేష భాగములో యోహాను గారు ప్రభువు యొక్క రాకడ కొరకై మార్గమును సిద్ధం చేయుడని  వెలిగెత్తి యోర్థను నది తీరమున ప్రకటించుచుండెను. బప్తిస్మ యోహాను ఈ లోకమునకు వచ్చినదే యేసు ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయుట కొరకు దాని ద్వారా ఏసుప్రభు ఇంకా త్వరగా తండ్రి పరిచర్యను ఈ లోకంలో చేయవచ్చు కాబట్టి.
మన జీవితంలో దేవుని యొక్క రాకడ కొరకు మార్గమును సిద్ధం చేయని యెడల దేవుడు మన ఇంటి గుండా ప్రవేశించరు, మనలోకి ప్రవేశించరు. మన యొక్క జీవితంకు మార్గమును హృదయ పరివర్తన ద్వారా, చెడును విడిచి పెట్టుట ద్వారా ఏర్పరచవచ్చు అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. మార్గమును సిద్ధం చేయుట చాలా కష్టం ఎందుకంటే అడ్డుగా ఉన్నటువంటి ప్రతిది కూడా తొలగించాలి అప్పుడే మార్గము ఏర్పరచగలరు కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఏదైతే అడ్డుగా ఉంటుందో మనము దానిని తీసివేయాలి. ప్రభువు కొరకు మార్గమును సిద్ధం చేయమని ఎడారిలో ఒక స్వరము వినబడెను అని యెషయా ప్రవక్త తెలియజేశారు. ఎడారి అనునది దేవుడిని కలుసుకునే ఒక స్థలం, మన జీవితాలు మార్చు స్థలం. మనము ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటారు అని తెలిపే ఒక ప్రదేశం. హాగారు ఎడారిలో ఉండగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నారు. ఏలియా నిర్జన ప్రదేశంలో ఉండగా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎడారి వలె నిరుత్సాహమైనటువంటి సమయములు ఎదురైనప్పుడు మనము దైవ అనుభూతిని పొందగలము. దేవుడు మనకు తోడుగా ఉంటారు.
ప్రతి లోయ పూడ్చబడును అని తెలుపుతున్నారు అనగా మనలో మనలో ఉన్నటువంటి అసమానతలను దేవుడు తన యొక్క వాక్యము ద్వారా దివ్య సంస్కారాలు ద్వారా నింపుతూ సరిసమానం చేస్తారు. అదేవిధంగా పర్వతాలు కొండలు సమము చేయబడాలి అనగా మనలో ఉన్నటువంటి గర్వము, అహము అనేటటువంటి చెడు గుణములను సమానము చేయాలి అనగా వినయము కలిగి జీవించాలి. వక్రమార్గములు సరిచేయాలి అనగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవాలి. ప్రభువుకి మన హృదయములో మార్గము సిద్ధము చేయాలంటే మన గర్వమును తగ్గించుకోవాలి, పాపపు జీవితాన్ని విస్మరించాలి. పరిత్యజించుకునే లక్షణము కలిగి ఉండాలి. ఈ యొక్క ఆగమన కాల రెండవ ఆదివారంలో మనందరం కూడా ధ్యానించవలసినటువంటి అంశము ఏమిటంటే దేవుని కొరకు మనము మన జీవితంలో ఎలాంటి మార్గమును సిద్ధం చేస్తున్నాం?. ఆయన కొరకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుకుని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా.? హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా? పాపక్షమాపణను కలిగి ఉంటున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
Fr. Bala Yesu OCD

30, నవంబర్ 2024, శనివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం

ఆగమన కాలం మొదటి ఆదివారం 
యిర్మీయా 33:14-16, 1 తెస్స3:12,4:2, లూకా 21:25-28,34-36
ఈనాడు తల్లి శ్రీ సభ ఆగమన కాలమును ప్రారంభించినది. ఆగమన కాలంతో ఒక కొత్త దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క ఆగమన కాలంలో మనము ప్రభువు యొక్క జన్మము కొరకై/రాకడ కొరకై ఎదురుచూస్తూ ఉన్నాం. ఆగమన కాలము ఒక ప్రత్యేకమైన కాలం ఎందుకనగా ఏసుప్రభు యొక్క పుట్టినరోజు కొరకై మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క కాలములో మనము మన హృదయములను పవిత్ర పరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తుంటాం. 
ఏసుప్రభు అనేక విధాలుగా మన మధ్యలోనికి వస్తారు. దివ్య సత్ప్రసాదం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము చదవడం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా అనేక విధాలుగా ప్రభువు మన మధ్యకు వస్తూ ఉంటారు. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుని యొక్క జన్మం మనందరి యొక్క హృదయములలో ప్రత్యేకంగా జరగాలని మనము ఆధ్యాత్మికంగా తయారవుతాం. 
ఈనాటి దివ్య గ్రంథ పఠణములు కూడా ప్రభువు రాకడ గురించి, నిరీక్షించుట గురించి, విశ్వాసముతో ఉండుటను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త దేవుని యొక్క రాకడను గురించి తెలియజేస్తున్నారు. యూదా ప్రజలు దేవుడిని మరచి, తన యొక్క ఆజ్ఞలను మీరారు. దేవుని యొక్క ప్రజలను నడిపించే రాజులు కూడా దేవుని ప్రవక్త అయినా యిర్మియా మాటలను వినలేదు అందుకే శిక్ష అనుభవించారు. దేవుని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత దేవుడు వారికి ఒక సంతోష వార్తను తెలియజేస్తున్నారు. కరుణ గలిగిన దేవుడు వారిని రక్షించుటకు దావీదు వంశము నుండి ఒక రాజును ఎన్నుకుంటానన్నారు. ఆ రాజు నీతి కలిగిన రాజు. ఆయన అందరికీ న్యాయం చేకూర్చే రాజు. ఆయన ప్రజలకు చేసిన ప్రతి ప్రమాణములను నిలబెట్టుకునే రాజు. 
యావే ప్రభువు ప్రజలకు ఒక ఆదరణ కర్త అయినటువంటి రాజును పంపిస్తూ వారికి కావలసిన స్వేచ్ఛను, స్వతంత్రమును దయ చేస్తారని చెప్పారు.
 దేవుడిచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు తనని ఆశీర్వదిస్తానని అది నెరవేర్చారు.(ఆది12:1-3)
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి కాపాడుతానని వాగ్దానం చేశారు దానిని నెరవేర్చారు (నిర్గమ 3:7-8)
దేవుడు రక్షకుడిని పంపిస్తానని ప్రవక్తల ద్వారా తెలియజేశారు దానిని క్రీస్తు జన్మము ద్వారా నెరవేర్చారు కాబట్టి ప్రభువు ఇచ్చిన వాగ్దానములను తప్పక నెరవేరుస్తారని మనము విశ్వసించాలి.
రక్షకుడు వచ్చే కాలం యూదా రక్షణము పొందును అని ప్రవక్త తెలుపుతున్నారు అనగా క్రీస్తు ప్రభువు ద్వారా అందరూ రక్షించబడతారని అర్థం. ఎన్నో సంవత్సరాల నుండి ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురుచూస్తున్నారు అది క్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేరుతుందని యిర్మియా ప్రవక్త తెలియజేశారు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజు అదే విధముగా ఆయన వంశము నుండి జన్మింపనున్న రాజు కూడా అదే విధముగా తన ప్రజలను పరిపాలించును. ఆ రాజు ఈ లోకంలో జన్మించిన సందర్భంలో దేవుని యొక్క రక్షణ దినము అనేది రానున్నది, ఆ దినము ప్రజల నుండి భయమును తొలగించును, బానిసత్వమును దూరం చెయ్యను ఇదంతా కేవలం నీతి గల రాజు అయినటువంటి క్రీస్తు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆయన కొరకు ఆశతో ఎదురు చూడాలని కూడా ప్రవక్త తన ప్రజలకు తెలియజేశారు. వాస్తవానికి ఎదురు చూడటంలో ఆనందం ఉంది, ఎదురు చూడటంలో ఆశ ఉంది, నమ్మకం ఉంది, సహనం, ప్రేమ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యిర్మియా ప్రవక్త ప్రజలకు రక్షకుడు వేంచేయు కాలం గురించి ఒక సంతోష వార్తను తెలుపుచున్నారు. 
ఈనాటి రెండవ పఠణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజల్లో పరస్పరమ ప్రేమ పెంచాలని అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఎల్లప్పుడూ కనబరుచుకొని జీవించాలని తెలియజేశారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వచ్ఛమైన మరియు నిస్వార్ధమైన ప్రేమను చూపించాలని పౌలు గారు తెలియజేశారు. తాను ఏ విధంగానైతే వారి మధ్య మెలిగారో అదే విధముగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించాలని కోరుకున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడ కొరకై మనలను సంసిద్ధమై ఉండమని తెలియచేస్తున్నారు
ప్రకృతిలో జరుగు మార్పులను గురించి ఏసు ప్రభువే స్వయముగా తెలియచేస్తున్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా మనం దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటారు. ప్రభు అనేక సందర్భాలలో నేను మీకు సర్వదా తోడై యుండును అని తెలియజేశారు కాబట్టి ఆయన మనతో అన్నివేళలా ఉంటారని మనం దృఢముగా విశ్వసించాలి. ఆయన యొక్క రాకడ కోసం మనం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి అదియే క్రైస్తవ విశ్వాసం. ఆటంకములకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. బాధ్యత లేకుండా సుఖ సంతోషాలతో శారీరకవాంఛలకు లోనై ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే దేవుని సంతృప్తి పరచలేము కావున పరిశుద్ధత కలిగి జీవించాలి మన యొక్క జీవితములను మనము ప్రభువు యొక్క రాకడ కొరకై తయారు చేసుకోవాలి. ప్రభువు మన కొరకై, మనలో ఉండుట కొరకై వస్తున్నారు కాబట్టి ఆయన కొరకు మన హృదయమును పవిత్ర పరచుకొని ఆయనను మనలో ఆహ్వానించు కోవాలి.
Fr. Bala Yesu OCD

23, నవంబర్ 2024, శనివారం

34వ సామాన్య ఆదివారం

34వ సామాన్య ఆదివారం
విశ్వవిబుడైన క్రీస్తు రాజు యొక్క మహోత్సవము.
దానియేలు 7:13-14,దర్శన 1:5-8, యోహాను 18:33-34
1 కొరింతి 15:20-26, 28
మత్తయి 25:31-46

ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవమును కొనియాడుతున్నది, 1925 వ సంవత్సరంలో 11వ భక్తినాధ పాపు గారు  ఈ పండుగను ప్రారంభించియున్నారు. 20వ శతాబ్దంలో యూరప్ దేశములో అధికారుల యొక్క పాలన కఠినంగా ఉండటంవల్ల, అప్పటి అధికారులు ప్రజలకు ప్రాముఖ్యతను వారి యొక్క అధికారంకు ప్రాముఖ్యతనిచ్చి జీవించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, జాతుల మధ్య వివక్షతను తీసుకుని వచ్చి ఉన్నారు. కొంతమంది దేవుడంటే విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో జీవించే వారు, అదేవిధంగా కొంతమంది యూదులను బంధించి చెరసాలలో వేసి చంపారు. ఈ విధంగా అధికారులు తమ యొక్క స్వార్థం కొరకై అధికారమును వినియోగించుకునే సందర్భంలో 11వ భక్తనాధ పాపు గారు ఆనాటి  అధికారులకు, ప్రజలందరికీ క్రీస్తు ప్రభువు యొక్క అధికారం  ఏ విధంగా ఉన్నది తెలియజేశారు. ఈ విశ్వమంతటికి క్రీస్తు ప్రభువే రాజు అని ప్రకటించి, మన హృదయ పీఠాలపై క్రీస్తు రాజుని ప్రతిష్టించుకోమని అదే విధముగా మన జీవితాలను ఆయన ఆధీనమునకు అప్పగించుమని పాపుగారు ప్రోత్సహించారు. 
పరిశుద్ధ గ్రంథం మరీ ముఖ్యంగా పాత నిబంధన గ్రంథం క్రీస్తు ప్రభువును రాజుగా చూపిస్తుంది,ఆయన రాజ్యపాలన గురించి ప్రవక్తలు ముందుగానే తెలియచేశారు.
యెషయా 9:6-7, యిర్మీయా 23:5, దానియేలు 7:13-14. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లితో 'తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యముకు అంతమే ఉండదు అని తెలియజేశారు'. పిలాతు కూడా ఏసుప్రభువుతో సంభాషించేటప్పుడు "నీవు యూదుల రాజువా"? అని అడుగారు. నీవే అంటున్నావు కదా అని ఏసుప్రభు తెలిపారు. ఆయన రాజు అని పవిత్ర గ్రంథములో చెప్పబడినది కాబట్టి మనందరం కూడా ఆయన  మన యొక్క రాజు అని గ్రహించి  ఆయన చెప్పిన విధముగా జీవింపసాగాలి.
ఈ లోకంలో ఎంతో మంది రాజుల గురించి మనము చదువు కొని ఉండవచ్చు, విని ఉండవచ్చు. ఏసుప్రభు యొక్క రాజరికం ఈ లోక రాజుల యొక్క పాలనకు భిన్నంగా ఉంటుంది. సిలువయే ఆయన సింహాసనం, ముళ్ళ కిరీటమే ఆయన రాజు కిరీటం, చేతిలోని దండమే తన యొక్క అధికారమునకు గుర్తు. పేద సాధలే తన యొక్క ప్రజలు. పరలోకమే తన రాజ్యం.
 ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పాలన చేసి ఉన్నారో మనందరం గ్రహించాలి, ఆయన మరణము తర్వాత కూడా ఒక తీర్పరి అయిన రాజుగా మనలను పరిపాలన చేస్తారు.
క్రీస్తు ప్రభువు ఎలాంటి రాజు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సేవ భావం కలిగిన రాజు- ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు కాదు. ఈ లోకంలో ఉన్న రాజులు ప్రతినిత్యం కూడా ఎదుటి వారి యొక్క సేవలను అందుకునే వారే, వారి యొక్క సుఖభోగాలు పేరు ప్రతిష్టల కొరకు పాలన చేసేవారు కానీ క్రీస్తు ప్రభువు ప్రతినిత్యం ఇతరులకు సేవ చేస్తూ వారి శ్రేయస్సు కొరకు జీవించారు.
2. ఆయన క్షమించే రాజు- ఏసుప్రభు శిలువ మీద వ్రేలాడే సమయములో తండ్రికి ప్రార్థన చేసినది ఏమనగా 'తండ్రి వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు కావున వీరిని క్షమించు' అని ప్రార్థన చేశారు. తన ప్రజలు తనకు విరుద్ధముగా చేసినటువంటి పాపములను క్షమించమని క్రీస్తు రాజు తన తండ్రిని ప్రార్థించారు. ఆయన మనందరి పాపములను క్షమించే రాజు.
3. ప్రేమించే రాజు- నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని తెలుపుచు, వారి కొరకు తన ప్రాణమును త్యాగం చేసినటువంటి గొప్ప రాజు క్రీస్తు ప్రభువు. ఆయన ప్రేమ ఎటువంటి భేదము లేనటువంటి ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ. అంతటి గొప్పదైన ప్రేమతో తన ప్రజలను పరిపాలించారు ఆయన మనందరిని  నిరతము ప్రేమించే రాజు.
4. నడిపించే రాజు- ఒక గొర్రెల కాపరి తన మందకు ముందుగా ఉండి గొర్రెలను ఏ విధముగా నైతే పచ్చిక బయలు వైపు నడిపిస్తారో అదే విధముగా క్రీస్తు రాజు  తన ప్రజలను పరలోకము వైపు నడిపిస్తారు, మంచి వైపు నడిపిస్తారు. మనము ఆయన స్వరమును విని నడుచుకోవాలి.
5. శాంతిని నెలకొల్పే రాజు-ఏసుప్రభు ఈ లోకమునకు వచ్చినది ఎందుకంటే మన అందరి జీవితాలలో శాంతి- సమాధానములు నెలకొల్పుట కొరకై. పాపము చేసిన మానవుడు దేవునికి దూరమైనప్పుడు శాంతి సమాధానము లేకుండా జీవించే సమయంలో మన అందరి కొరకై తన్ను తాను బలిగా సమర్పించుకుని మనలను తండ్రితో సఖ్యపరచి ఉన్నారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి శాంతిని దయచేసారు.
6. వినయము కలిగిన రాజు-ఏసుప్రభు తనను తాను రిక్తుని చేసుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించి సేవకు రూపం దాల్చి, శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంతో వినయముతో జీవించారు. అయిన పవిత్రుడైనప్పటికీ పాపాత్ములమైన మన మధ్య జీవించారు. ఇది ఆయన యొక్క వినయమునకు గొప్ప నిదర్శనం.
7. మనందరినీ తన బాగా మార్చే రాజు. క్రీస్తు ప్రభువు మనందరం కూడా తనలాగా మారాలని కోరుతున్నాను అందుకని ఈ భూలోకమునకు వచ్చి మనకు అనేక రకములైన విషయములు తెలియజేశారు. దేవుని యొక్క ప్రతిరూపమున జన్మించిన మనందరం ఆయనను పోలినటువంటి వ్యక్తులుగా జీవించినవి అని ప్రభువు కోరుకున్నావు. ఏ అధికారి కూడా తనున్న స్థానంలో వేరే వారు ఉండటానికి ఇష్టపడరు కానీ క్రీస్తు రాజు మనందరం కూడా తన రాజ్యంలో ఉండాలి అలాగే తనలా ఉండాలని కోరుకున్నారు. 12 మంది శిష్యులను పిలిచి వారు తనలాగా మారాలని కోరుతున్నటువంటి ప్రభువు మన క్రీస్తు రాజు.
ఈనాడు క్రీస్తు రాజు యొక్క పండుగను జరుపుకునే సందర్భంలో ఆయన ఏ విధముగా జీవించి ఉన్నారో మనందరం కూడా ఆయన రాజ్యమునకు చెందిన వారు అయినట్లయితే ఆయన ఇచ్చే సూచనలు, ఆజ్ఞలు పాటించి జీవించాలి. అప్పుడు మాత్రమే మనందరం పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాం. క్రీస్తు ప్రభువుని నీ హృదయ రాజుగా అంగీకరిస్తున్నావా? దాని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావా అని వ్యక్తిగతంగా ఆలోచించి మనందరం కూడా ఆయన వలె జీవించాలి. క్రీస్తు రాజును మన యొక్క హృదయములను పరిపాలించే విధముగా మనము ఆహ్వానించాలి. ఆయన మన హృదయములను పరిపాలించిన యెడల మనందరం సన్మార్గంలో నడవగలం.
Fr. Bala Yesu OCD

16, నవంబర్ 2024, శనివారం

33 వ సామాన్య ఆదివారం

33 వ సామాన్య ఆదివారం 
దానియేలు 12:1-3, హెబ్రీ10:11-14,18 మార్కు 13:24-32
ఈనాటి పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకై మనందరం కూడా సంసిద్ధులై జీవించాలి. అదేవిధంగా దేవుడు తనను విశ్వసించే వారితో ఎల్లప్పుడూ ఉంటారని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రభువు మన యొక్క కష్ట కాలములో, అంత్య దినములలో మనతోనే ఉంటారు ఎందుకనగా ఆయన ఇమ్మానుయేలు ప్రభువు, మనతో ఉండే దేవుడు. 
ఈనాటి మొదటి పఠణంలో దానియేలు ప్రవక్తకు కలిగిన నాలుగవ దర్శనము గురించి వింటున్నాము. మానవులు మరణించి సమాధి చేయబడిన తర్వాత మట్టిలో నిద్రించే చాలా మంది సజీవులవుతారని చెబుతున్నారు. 
ఆనాడు విశ్వాస పాత్రులుగా జీవిస్తున్న యూదులను నాల్గవ అంతెయోకు(Antioch. IV)  రాజు అన్యాయంగా వారిని యూదులను శిక్షకు గురిచేసి చంపారు. ఈ యొక్క రాజు ఆయన యూదా ప్రజల మీద అనేక రకములైన ఆంక్షలు విధించి వారు గ్రీకు మతస్తుల ఆచారాలను, పద్ధతులను అనుసరించాలని ఒత్తిడి చేశారు. యూదా ప్రజల సున్నతిని తిరస్కరించాడు, దేవాలయాలను ధ్వంసం చేశాడు దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులను నాశనం చేశారు అది మాత్రమే కాకుండా వారికి విలువైన పవిత్ర గ్రంథం "తోరా" యొక్క ముఖ్య భాగాలను కాల్చివేశాడు. ఇలాంటి ఒక కష్టతరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రవక్త దేవుని యొక్క అభయంను /రక్షణ వినిపించారు. దేవుని యెడల విశ్వాసము కలిగిన యూదులు కూడా మరణించిన తర్వాత శరీరంతో పునరుత్థానం చెందుతారని తెలిపారు. దేవుని యందు విశ్వాసము మరియు నిరీక్షణ కలిగి జీవించాలని కూడా ప్రవక్త వారిని ప్రోత్సహించారు. దానియేలు ప్రవక్త ప్రజలు అనుభవించే బాధలను చూసి వారికి ఊరటనిస్తున్నారు. దేవుడు ఎప్పుడూ తన ప్రజలకు చేరువలోనే ఉంటారని తెలియజేశారు. దానియేలు గ్రంధం 11: 21-39 వచనములు చదివినట్లయితే ఇక్కడ సిరియా రాజు అయినా నాలుగవ అంతియోక్ యొక్క దురాలోచనలు, ఆయన అహం, స్వార్థం ఆయన చేసే హింసలు అర్థమవుతాయి. ఎన్ని విపత్తులు ఎదురైనా సరే ప్రజలలో ఒక విధమైన ఆశను నమ్మకాన్ని ప్రవక్త కలుగ చేశారు. వారి జీవిత అంత్య దినములు సంభవించినప్పుడు దేవుని కోసం ఎలాగ జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. క్రైస్తవ విశ్వాసము మరియు యూదుల యొక్క విశ్వాసము ఏమిటనగా అంతిమ దినమున అందరు కూడా సజీవులుగా లేపబడతారని. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలకు దేవుని వాక్యము ప్రవచించగానే అవి శరీరమును పొందుకొని జీవము కలిగి ఉన్నాయి. యెహెజ్కేలు 37:13. చనిపోయిన వారు దేవుని కృప వలన సజీవులవుతారని ఈ యొక్క వాక్యము తెలుపుతుంది. మక్కబీయులు గ్రంథంలో ఏడుగురు సోదరులు ప్రాణత్యాగము చేశారని వింటున్నాం ఎందుకంటే వారికి పునరుత్థానమునందు విశ్వాసము ఉన్నది అందుకని వారు తమ ప్రాణాలను దేవుని కొరకు త్యాగం చేశారు.(2 మక్కబీయులు 7:9) ఈ యొక్క మొదటి పఠణం ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము జీవించాలి. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా జీవించాలి.
ఈనాటి రెండవ పఠణం యేసు క్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ఈ యొక్క భాగములో ప్రత్యేక విధముగా ఏసుప్రభువు సమర్పించిన బలికి మిగతా యాజకులు సమర్పించిన బలికి ఉన్నటువంటి వ్యత్యాసమును తెలియజేస్తున్నారు. పూర్వ నిబంధన ప్రధాన యాజకులు ఒకే రకమైన బలులు అర్పించినప్పటికీ ప్రజల పాపాలు తొలగించలేకపోయారు కానీ క్రీస్తు ప్రభువు తన యొక్క బలిద్వారా అందరి పాపాలను ఒక్కసారిగా మన్నించారు. ఆయన సమర్పించిన బలిలో రక్షణ సామర్థ్యం ఉంది. ప్రభువు సమర్పించిన బలి విశ్వాసులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేస్తుంది శుద్ధికరిస్తుంది అదేవిధంగా అందరూ రక్షణ పొందుటకు సహాయపడుతుంది.  పాత నిబంధన గ్రంథంలో వారు సమర్పించిన బలులన్నీ కేవలము క్రీస్తు ప్రభువు యొక్క బలితో పరిపూర్ణమయ్యాయి. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు యొక్క రెండవ రాకడను గురించి తెలియజేస్తున్నది. క్రీస్తు శకం 69 వ సంవత్సరంలో రోమీయులు క్రైస్తవులను మరియు క్రైస్తవ మతం స్వీకరించిన యూదులను అనేక రకాల హింసలకు గురి చేశారు అలాంటి సమయంలో తన యొక్క ప్రజల విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మరలా వస్తాడని నమ్మకమును కలిగిస్తూ మార్కు సువార్తికుడు ఈ యొక్క మాటలను రాస్తున్నారు. తనకు కలిగినటువంటి దర్శనం వలన మనుష్య కుమారుని రాకడ ద్వారా ప్రపంచంలో కొన్ని ప్రకృతి మార్పులు జరుగుతాయని మార్కు గారు తెలియజేశారు. వాస్తవానికి నిజమైన విశ్వాసులకు అవన్నీ భయపెట్టే సంకేతాలు కావు ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం గా జీవించిన వారికి ఎల్లప్పుడూ మేలు కలుగును ప్రభు వారందరినీ రక్షించును. ఏసుప్రభు అత్తి చెట్లనుండి ఒక గుణపాఠం ను నేర్పిస్తున్నారు. ఈ యొక్క అత్తి చెట్ల ఆకులు వసంత రుతువు చివరిలోనే చిగురిస్తాయి అవి అలా కనిపించినప్పుడు ఒక కొత్త కాలం సంభవించునదని మనకు తెలుస్తుంది ఆ కాలంకు తగిన విధంగా మనం కూడా తయారవ్వాలి. ఆకులు రాలిపోయాయి అంటే చెట్టు చనిపోయినది అని కాదు అర్థం, కొత్త ఆకులు వస్తాయని అర్థం. అదే విధముగా దేవుని యొక్క రెండవ రాకడ జరిగినప్పుడు కూడా క్రొత్తకాలం ప్రారంభమవుతుంది కాబట్టి మనం దానికి తగిన విధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న పాపము, స్వార్థము, అహం అన్నింటిని చంపేయాలి అప్పుడే దేవునితో క్రొత్త జీవితం ప్రారంభించగలం.
 దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధముగా ఉండాలి. ఆయన యొక్క రాకడ ఎప్పుడు ఎలాగా వచ్చునో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రతినిత్యం కూడా మనము మనల్ని తయారు చేసుకుంటూ జీవించాలి. చివరిగా ఈ యొక్క పఠణముల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు.
1. నిరీక్షణ కలిగి ఉండుట 
2. విశ్వాసము కలిగి జీవించుట 
3. దేవుని యొక్క రాకడకు సంసిద్ధత కలిగి జీవించుట 
4. ప్రభువుకు సాక్షులై ఉండుట. 
5. దేవునికి అనుగుణంగా జీవించుట.

Fr. Bala Yesu OCD

15, నవంబర్ 2024, శుక్రవారం

అంత దినములు ఎలా ఉండును

 అంత దినములు ఎలా ఉండును 

లూకా 17: 26-37 

నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు  ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో  ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును." "ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?" అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును" అని యేసు చెప్పెను. 

అంతదినములు ఎలా ఉండును? అని ప్రభువు ఈ సువిశేషభాగంలో  చెబుతున్నారు. ఒకసారి నోవా దినములను, లోతు దినములను గుర్తు చేస్తున్నారు. నోవా రోజులలో అందరు తినుచు త్రాగుచు ఉన్నారు.  అందరు వారి వారి రోజు వారి పనులలో నిమగ్నమై ఉండగా ఎటువంటి హెచ్చరిక లేకుండా, హఠాత్తుగా జలప్రళయము వచ్చింది, లోతు కాలంలో ప్రజలు వారి వారి పనులలో ఉన్నారు. ఆసమయంలోనే   ఆకాశం నుండి గంధకము వర్షించినది.  ప్రభువు రోజు ఎప్పడు మనకు ఇష్ఠమైనపుడు, మనం కోరుకున్నప్పుడు  రాదు.

 ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు.  నోవా కాలంలో, మరియు లోతు కాలంలో కూడా  ప్రభువు ప్రజలను హెచ్చరించాడు.  అప్పటినుండి నోవా , లోతు ఆ రోజు కోసం సిద్ధపడ్డారు. నోవా  దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక ఓడను తయారు చేసాడు. మిగిలిన ప్రజలు వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు కాని ప్రభువు మాటను పట్టించుకోలేదు.   నోవా మాత్రము వారితో  కలవకుండా తనకు దేవుడు చెప్పినట్లుగా  చేసాడు. జలప్రళయము వచ్చింది నోవా కుటుంబము మాత్రమే రక్షించబడింది. మిగిలిన వారు మాత్రము ప్రాణములను కోల్పోయారు. లోతు కాలములో కూడా ప్రభువు ప్రజలను హెచ్చరించాడు , కాని వారు చేసే పనులలోనే వారు ఆనందం వెదుకుకున్నారు . అందరు వారి వారి పనులలో నిమగ్నం అయిపోయారు.  లోతు కుటుంబము  మిగిలిన వారి వలే కాకుండా జీవించడం జరిగింది.  లోతు కుటుంబం రక్షించబడింది. 

దేవుడు మనలను హెచ్చరించినప్పుడు మనం సిద్ధపడాలి, అలా కాకుండా అంత సవ్యముగా ఉన్నది అనే అపోహలో ఉండి క్షమాపణ పొంది, రక్షించబడే అవకాశం కోల్పోతారు.  నోవా కుటుంబం రక్షించబడింది, కాని లోతు కుటుంబంలో అందరు రక్షించబడలేదు. లోతు భార్య దేవుడు చెప్పినట్లు చేయకుండా ఆ పట్టణమునకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంది, వెనకకు తిరుగుతుంది. ఉప్పు స్థంభం వలె మారిపోతుంది. మన కుటుంబంలో దేవుడు ప్రేమించే వ్యక్తి ఉన్నంత మాత్రమున మన కుటుంబం మొత్తం రక్షించబడాలని లేదు. ప్రతి వ్యక్తి కూడా తాను పరివర్తన చెంది మారితే దేవుని అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. వారి కుటుంబంలో మంచి వారు ఉండటం కొంత వరకు మాత్రమే వారికి ఉపయోగపడుతుంది కాని వారి వ్యక్తిగత జీవితం కూడా ప్రభువు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. 

ప్రభువుని రాక సమయంలో కూడా ఇలానే జరుగును అని దేవునివాక్కు చెబుతుంది. ఇది ప్రతి ఒక్కరు వారి వారి జీవితములను సరిచూసుకుని జీవించాలి. ఆ రోజు ఎవరు అయితే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఎవరి జీవితం మరియొకరి జీవితం మీద ఆధారపడి ఉండదు. ఎవరి జీవితమునకు వారే బాధ్యత వహించాలి. ఇది భయపడే రోజు ఏమి కాదు, ప్రతి  నిత్యం సిద్దపడి ఉంటె అది ప్రభువు సాక్షాత్కారం అయ్యేరోజు. సరియైన సిద్ధపాటు లేకపోతే అది భయపడవలసిన రోజే అవుతుంది. 

సిద్ధపాటు 

ప్రభువు రాకడకు ఆయన అనుచరులు ప్రతి నిత్యం సిద్దమై ఉండాలి.  ఎందుకు  ప్రభువు రోజు కోసం ప్రతినిత్యం  అప్రమత్తముగాను, సిద్ధముగాను ఉండాలి అంటే ఆ రోజు ఎలా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందరు వారి వారి పనులలో ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు వస్తుంది. దేవుని ఆజ్ఞలకు ఎవరు అయితే బద్ధులై ఉంటారో వారికి అది ఎప్పుడు వచ్చిన భయ పడవలసింది ఏమి ఉండదు.  ఎందుకంటే వారు ఆ రోజు కోసం సిద్ధంగా ఉన్నారు. జలప్రళయము వచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించిన నోవా కుటుంబం రక్షించబడింది, లోతు రక్షించబడ్డాడు. దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే దానికి సిద్దపడటం. 

ప్రార్ధన : రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని  వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్ 


14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

13, నవంబర్ 2024, బుధవారం

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత 

యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,  గొంతెత్తి, " ఓ  యేసు ప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి "మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు" అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే  శుద్ధిపొందిరి. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరియుడు. అపుడు యేసు "పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని  స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?" అనెను. పిదప యేసు అతనితో "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్లుము" అనెను. 

ఈ సువిశేష భాగంలో  కృతజ్ఞత, విశ్వాసం మరియు దేవుని కృపను గురించి చూస్తున్నాము. పది మంది కుష్టురోగులు అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తున్నారు.    వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు  అనేక విషయాలలో పొందుతూనే ఉంటాము. కాని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడములో మాత్రము విఫలం అవుతుంటాము. దేవుని దగ్గరకు వచ్చి  కృతజ్ఞత తెలియజేయుటము,  ఒక వ్యక్తిని  దేవునికి దగ్గర చేస్తుంది. దేవునితో సఖ్యత ఏర్పాటు చేస్తుంది. మరియు దేవునితో అనుభంధమును ఏర్పరచి మనలను ఆయనకు ఇష్టులను చేస్తుంది. 

విశ్వాసం మరియు విధేయత

పది మంది కుష్టు రోగులు యేసు ప్రభువునకు ఎదురయ్యారు, దూరంగానే ఉండి, ప్రభువా మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు. ప్రభువు  కరుణ మీద వారికి ఎంతో విశ్వాసం ఉన్నది. ఆయనకు తమ సమస్య తెలిపితే వారికి స్వస్థత దయచేస్తాడు అని వారు నమ్మారు.   యేసు ప్రభువు వారిని వెళ్లి  యాజకులకు తమను తాము చూపించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్లిపోతున్నారు. యాజకుడు మాత్రమే  కుష్టు రోగంతో బాధ పడేవారిని స్వస్థత పొందిన తరువాత వారు స్వస్థులైన విషయాన్నీ ధ్రువీకరించగలరు. అందుకే యేసు ప్రభువు వారిని పోయి యాజకుడిని కలవమని చెబుతున్నారు. యేసు ప్రభువు ఇతర సమయాలలో వలె వారిని తాకలేదు. వెళ్లి యాజకుడిని కలవమని చెప్పాడు. వీరు మమ్ములను తాకమని అడుగలేదు. ప్రభువు మాటకు విధేయించి వెళుతున్నారు. ప్రభువు చెప్పినట్లు చేయగానే వారు మార్గ మద్యంలో ఉండగానే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గమనించవలసినది,  ప్రభువు పొమ్మని చెప్పినవెంటనే వారికి  స్వస్థత కలుగలేదు, అయినప్పటికీ ప్రభువు చెప్పగానే వారు యాజకుని కలువడడానికి వెళుతున్నారు. ప్రభువు మాట  మీద వారికి ఉన్న నమ్మకం తెలియజేస్తుంది. ప్రభువు మాటను విధేయించడం ద్వారా వారు స్వస్థత పొందుతున్నారు. ప్రభువు మాటను మారు మాటాడకుండా   విధేయించిన తీరు ప్రభువు మాటకు వారు ఇచ్చిన గౌరవం మరియు ఆతని మీద ప్రగాఢమైన నమ్మకం తెలియజేస్తుంది.  వారి విధేయతకు తగినట్లే మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుతున్నారు. 

సమరియుని ప్రత్యేకత 

అందరు స్వస్థత పొందుతున్నారు. కాని తనలో వస్తున్నా మార్పును గమనించగలిగినది ఒక సమరియుడు మాత్రమే. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువు ద్వారా తమ జీవితంలో జరిగిన ప్రతి మార్పును గమనించగలుగుతాడు. కృతజ్ఞతచెల్లిస్తాడు. దేవుని అంతులేని అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తి కేవలం ఒక సమరియుడు మాత్రమే.యూదులు సమరియులతో ఏ పొత్తు ఉండకూడదు అనుకుంటారు. సమరియులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు అని వారిని దూరం పెట్టారు. వారిని విదేశీయులుగానే భావించేవారు. కాని దేవుడు అందరికి తన దయను కరుణను చూపిస్తూనే ఉంటాడు. మానవునిలా ఒకరిని దూరం పెట్టేవాడు కాదు ప్రభువు.  ప్రభువులోని ఈ గుణం మనం అనేక సార్లు చూస్తాము. సమరియును కృతజ్ఞత ప్రభువు తనకు చేసిన మేలును గుర్తు చేస్తుంది. అంతేకాక సమాజం తనను చూసిన విధంగా కాకుండా దేవుడు తనను నూతన సృష్టిగా చూస్తున్నాడు అన్న విషయం తనకు తెలుస్తుంది.  

యేసు ప్రభువు ఆ సమరియునితో పది మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ? అని అడుగుతున్నాడు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని అనుగ్రహాలు పొందుతాము కాని కృతజ్ఞత తెలుపుటకు మాత్రము  వెళ్లము. కృతజ్ఞత తెలుపడం అంటే  దేవున్ని స్తుతించటం. మన కృతజ్ఞత దేవుని మహిమను, కీర్తిని  వెల్లడి చేస్తుంది. అంతేకాక ఈ కృతజ్ఞత ఇతరులు ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత దేవుడు చేసిన మేలుకు సాక్ష్యంగా ఉంటుంది. 

 ప్రార్థన

కరుణామయుడైన ప్రభువా! మీ కరుణ అనంతం. ఎవరు మీ వద్దకు వచ్చి మిమ్ము కరుణించమని అడిగిన వారిని కరుణించారు. వారి జీవితాలలో లేమిని తీసివేసి వారికి కావలసిన వాటిని ఇచ్చి వారిని  సమృద్ధిగలవారీగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. అనేకసార్లు నా జీవితంలో కూడా సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా బలహీనంగా ఉన్న సమయాలలో సమాజం కుష్టువానిని బయట పెట్టినట్లు, నన్నును బయట పెట్టిన నీవు కరుణచూపించావు. నన్ను హత్తుకొనుటకు సంకోసించలేదు. నేను నీకు చెందినవాడినని ధృవీకరించావు.  అయినప్పటికీ  మీరు చేసిన మేలును గుర్తించకుండ ఉన్నాను. ప్రభువా! మీ మేలును గుర్తించకుండా,  మీకు కృతజ్ఞత తెలప కుండా ఉన్న సందర్భాలలో నన్ను క్షమించండి. మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని, కృతజ్ఞత తెలియజేస్తూ, మీకు కీర్తిని,  మహిమను కలిగిస్తూ , మీ మేలులకు సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

9, నవంబర్ 2024, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం 
1 రాజుల 17:10-16, హెబ్రీ 9:24-28, మార్కు 12:38-44
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మనము ఉదారముగా ఉండిన యెడల దేవుని యొక్క దీవెనలు పొందుతాము అనే అంశమును గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక విధముగా చెప్పుకోవాలంటే దేవునికి ఉదాహరణగా సమర్పించే అర్పణ గురించి ఈనాటి పఠణంలో తెలియచేస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన పొందిన ప్రతిదీ దేవునికి మరియు పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయము ఉండాలి. దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతూ మనకు ఉన్నదంతా సమర్పించుకుని జీవించిన ఎడల ఇంకా మనము అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారె ఫతు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యొక్క కృపను పొందుకున్నది. ఈ మొదటి పఠణం యొక్క సన్నివేశం మనం గమనించినట్లయితే ఆహాబు రాజు యెసబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవముల ఆరాధించే సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరముల పాటు ఆ దేశమున కరువు సంభవిస్తుందని ఏలియా ప్రవక్త తెలియజేశారు ఈ కరువు కాల సమయంలో దేవుడు ఏలియాను సారెఫతుకు పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయంలో దేవుడు ధనమున్న వారిని వదిలివేసి కేవలము అద్భుతము చేయుటకు ఒక పేద వితంతువును, అది కూడా అన్యురాలను ఎంచుకుంటున్నారు. బహుశా ఆమె మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, ప్రార్థన పరిరాలయుండవచ్చు సోదర ప్రేమ కలిగిన వ్యక్తి ఉండవచ్చు అందుకని దేవుడు ఆమె యొక్క జీవితమును రక్షించుట నిమిత్తమై ఏలియా ప్రవక్తను అచటకు పంపిస్తున్నారు. 
ఏమి జీవితంలో మనము కొన్ని విషయములను ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకోవాలి. 
1. ఆమె యొక్క గొప్ప విశ్వాసం: ఏలియా ప్రవక్త  తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్భంలో వెంటనే దేవుని యందు ఉన్న విశ్వాసము వలన ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. విశ్వాసము వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టే జాతులకు జ్యోతిగా దీవించబడ్డారు, మోషే విశ్వసించారు కాబట్టే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఉత్తమ నాయకునిగా చేయబడ్డాడు, కననీయ స్త్రీ విశ్వసించినది కావున దేవుని యొక్క వరము పొందినది, యాయీరు దేవుని విశ్వసించారు కాబట్టి తన యొక్క కుమార్తెను పొందగలిగాడు. విశ్వాసము ఉంటేనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేస్తారు ఈ యొక్క పేద వితంతువు కూడా తానున్నటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని యందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నది కావున దేవుడు ఆమె జీవితమును దీవించారు. 
2. ఉదాహరణగా ఇచ్చే మనసు- ఈ వితంతువు తన జీవితంలో తనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా కానీ తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నది. ఆమె ఏలియాతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం, ప్రేమ దాగి ఉన్నవని ఆమె భావించినది. ఉదారంగా ఇస్తే దేవుడి దీవిస్తారని భావించింది. లూకా6:38, ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారని నమ్మినది. 2 కొరింతి 9:6-7 ఈ యొక్క పేద వితంతువు ఉదారంగా ఇచ్చారు కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా దీవెనలు పొందింది. 
3. త్యాగం చేసే గుణం- ఈ వితంతువు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియనప్పటికీ ఆమె తన యొక్క ఆహారమును వేరే వారికి త్యాగం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే అది తిని వారు కూడా చనిపోదామనుకున్నారు ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అయినా ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో ఉన్న ఆమె త్యాగం చేసినది కావున ఆమె యొక్క త్యాగమును ప్రభువు దీవించారు. మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకుని దేవునికి సమర్పించు జీవిస్తే తప్పనిసరిగా అది పెద్ద సమర్పణ. చాలా సందర్భాలలో దేవుడు మెచ్చుకునే సమర్పణ ఏమిటంటే దేవునికి ఉదారంగా ఇచ్చుట. ప్రభువు పేద వెధవరాలి కానుకను మెచ్చుకున్నారు. తొలి క్రైస్తవ సంఘ జీవితమును మెచ్చుకున్నారు అలాగే ఈ సారెఫతు వితంతువు జీవితమును మెచ్చుకుంటూ ఆమె త్యాగముకు ప్రతిఫలంగా ఆహారం సమృద్ధిగా ఇచ్చారు. 
4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత- ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల విధేయత చూపినటువంటి అంశమును చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన వెంటనే ఆమె దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి జీవించినది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితములు నిండుగా దీవించబడతాయి. పవిత్ర గ్రంథంలో అబ్రహాము, మోషే, యెహోషువ ఇంకా చాలామంది వ్యక్తులు దేవుడికి విధేయుత చూపించి దీవెనలు పొందారు అదే విధంగా ఈ వితంతువు కూడా దేవుడి యెడల విధేయత చూపించి ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. 
ఈనాటి సువిశేష భాగములో పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం చదువుకుంటున్నాం. కానుకల పెట్టె దగ్గర ప్రతి ఒక్కరూ కానుకలను ప్రభువు పరిశీలించారు. చాలామంది ధనవంతులు వారు కానుక వేసేటప్పుడు అది అందరికీ కనబడాలి అని విసిరి వేస్తుంటారు. ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికీ కనబడేలా వారు కానుకలు పెట్టెలో ధనం వేసేవారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి కొంతగా దేవునికి సమర్పించేవారు కానీ ఈ యొక్క పేద వితంతువు తనకు ఉన్నది మొత్తము కూడా దేవునికి సమర్పించుకుని జీవించారు. ఆమె దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినది. తన యొక్క జీవిత మనుగడ కొరకు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి ఉంది. మనకు ఉన్న దానిలో దేవునికి ఇస్తే దానిలో గొప్ప త్యాగం ఏమీ లేదు కానీ మనకి ఉన్నది మొత్తం కూడా దేవునికి ఇస్తే అది గొప్ప త్యాగమే. ఈ యొక్క పేద వితంతువు తాను సమర్పించినది కొద్దిదైనప్పటికీ తన దగ్గర ఉన్న మొత్తము సమర్పించినది కావున ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అందుకనే ప్రభువు ఆమెకు న్యాయం చేశారు. ఈనాటి ఈ యొక్క పరిశుద్ధగా గ్రంధ పఠణముల నుండి మనం కూడా త్యాగ గుణము, ఉదార స్వభావం, విశ్వాసము కలిగి జీవించుట అనే అంశములను అలవర్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

మార్కు 6 : 14 – 29

 February 07 హెబ్రీ 13 : 1 - 8 మార్కు 6 : 14 – 29 ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను. హేరోదు రాజు అది వినెను. "స్నాపకుడగు యోహాను మృతులలో ను...