14, నవంబర్ 2024, గురువారం

లూకా 17: 20-25

దేవుని రాజ్యము 

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది." యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని  మీరు చూడరు. ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక  అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు. ఏలయన మెరపుమెరసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా  అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను. 

 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా  యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: "దేవుని రాజ్యము కంటికి  కనబడునట్లు  రాదు. 'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది."పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఇది. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. లేదా యిస్రాయేలు ఎప్పుడు స్వతంత్ర రాజ్యాంగ అవతరిస్తుంది అని అడుగుతున్నారు.  యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం వారు కోరుకున్నది కాదు. కాని వారికి ఒక నూతన సత్యాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. అది ఏమిటిఅంటే దేవుడు రాజ్యం కంటికి కనపడునట్లుగా రాదు. మరియు అది మీలో ఉన్నది అని ప్రభువు చెబుతున్నాడు. ఇది ఎందుకు కంటికి కనపడదు? దేవుని రాజ్యం అనుభవించాలి, అది ప్రభువు వద్ద నుండి క్షమాపణ పొందడం వలన, ఆయన ప్రేమను పొందడం వలన అనుభవిస్తుంటాం. దేవుని రాజ్యం బహ్యమైనది. అది అంతరంగికమైనది. అది మనలో ఉన్నది. నాలో మరియు నీలో ఉన్నది. నాలో ఉన్న ఆ దేవుని రాజ్యమును ఎలా అనుభవించగలం.

యేసు ప్రభువు దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నాడు. కాని ఎందుకు మనము దానిని అనుభవించలేకపోతున్నాము? మనము యేసు ప్రభువు క్షమా , ప్రేమ కరుణ అను గుణాలు మనలో లేకపోవడం వలన దేవుని రాజ్యమును అనుభవించలేకపోతున్నాము. యేసు ప్రభువు ప్రజలును దేవుని రాజ్యమునకు సిద్ధపరస్తూ మరు మనస్సు పొందమని, క్షమ, ప్రేమ, కరుణ గుణాలు కలిగిఉండమని చెబుతారు. ఇవి మానవుణ్ణి దేవుని రాజ్యం అనుభవించడానికి అర్హుడని చేస్తాయి. ఈ గుణాలు మనిషిని అంతరంగికంగా మారుస్తుంటాయి. నూతన జీవితం జీవించేలా చేస్తాయి.  దేవుని రాజ్యం అనుభవించేలా చేస్తాయి. ప్రభువు ప్రేమ కరుణ, క్షమ ద్వారా ఆయనను అనుభవించకుండా ఆయన అక్కడ ఉన్నాడు లేక ఇక్కడ  ఉన్నాడు అనే మాటలను నమ్మవద్దు అని ప్రభువు చెబుతున్నారు.

 ఎందుకు దేవుని రాజ్యము ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని ఎవ్వడు చెప్పజాలడు అని ప్రభువు అంటున్నాడు. మరియు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మనుషులు అంటారు కాని మీరు వెళ్ళవద్దు అని ప్రభువు ఎందుకు చెబుతున్నారు. దేవుని రాజ్యము మనలో ఉంది కనుక దానిని ఇంకా ఎక్కడో వెదకనవసరం లేదు. మనలోనే దానిని పొందవచ్చుకనుక సంఘంలో, కుటుంబంలో మన మనసులో ప్రభువుని గుణాలు పెంపొందినప్పుడు దానిని అనుభవించగలుగుతాం. ప్రభువును, దేవుని రాజ్యమును వేరు చేసి చూడలేము. ప్రభువును పొందినప్పుడు మనము దేవుని రాజ్యమును కూడా పొందుతాము. ప్రభువును పొందటం అంటే సమస్తమును పొందటమే అది దేవుని రాజ్యమునుకూడా.  ప్రభువును చూచుట కొరకు ఎక్కడకు వెళ్లనవసరం లేదు, ఆయన మన మధ్యనే ఎప్పుడు ఉంటాడు. దివ్య సత్ప్రసాదంలో ప్రతిరోజు ఆయనను కలుసుకోవచ్చు. దేవుని వాక్కు ద్వారా  ఆయనను  కలుసుకోవచ్చు, ప్రేమను పంచుకొనుట ద్వారా ఆయనను కలుసుకోవచ్చు. మన ఆత్మలో ఆయనను కలుసుకోవచ్చు. 

ప్రభువును మనం ఆత్మలో ఎలా కలుసుకోవచ్చు? పునీత ఆవిలాపురి తెరెసామ్మ గారు దీని గురించి వివరిస్తూ దేవుడు మన ఆత్మలో ఆసీనుడై ఉన్నాడు. మన అంతరాత్మలోకి మనం ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్న ప్రభువును కలుసుకోవచ్చు. కాని మనం ఆత్మలోనికి ప్రవేశించాలంటే చాలా ఓపికతో మరియు సాహసంతో కూడిన ప్రయాణం చేయాలి. మనలోనికి మనము ప్రవేశించే సమయంలో మన నిజరూపం మనకు తెలుస్తుంది కొన్ని సార్లు మనమీద మనకు ఏహ్యభావం కలుగవచ్చు ఎందుకంటే మనలో ఉన్న చెడు మనకు తెలుస్తుంది. వీటన్నిటి  తరువాత మన అంతరాత్మలో ప్రభువును కలుసుకోవచ్చు. కాని ఈ ప్రయాణంలో మనం అనేక ఆటంకాలు పొందవచ్చు. వాటిని అధిగమిస్తేనే ప్రభువును మనం కలుసుకోగలం. ఈ ప్రయాణము ప్రార్థన, వినయముతో పాటు విశ్వాసము,నమ్మిక ప్రేమ అను సుగుణాల ద్వారా కొనసాగించాలి. 

ప్రార్ధన: ప్రభువా! మీరు మా మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని అనేకసార్లు మర్చిపోయి మిమ్మును ఎక్కడెక్కడో వెదకడానికి ప్రయత్నిస్తున్నాను. మిమ్మలను కలుసుకొనుటకు మీరు మాకు ఎప్పుడో మార్గమును చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుటను చూచి మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటుంది అని మీరు చెప్పారు. మీ ప్రేమను వ్యక్త పరచడం, మీ కరుణను చూపడం ద్వారం మీ క్షమను పంచడం  ద్వారా మిమ్ములను  కలుసుకోవచ్చు అని తెలుసుకున్నాము అలా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. ప్రభువా మీరు నాలో ఉన్న విషయాన్ని తెలుసుకొని మిమ్ములను కలుసుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ సుగుణాలను అలవరుచుకొని మీ రాజ్యములో పాల్గొనుటకు అర్హులను చేయండి. ఆమెన్ 

13, నవంబర్ 2024, బుధవారం

లూకా 17:11-19

 సమరియుని కృతజ్ఞత 

యేసు సమరియా, గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,  గొంతెత్తి, " ఓ  యేసు ప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి "మీరు వెళ్లి యాజకులకు కనిపింపుడు" అని చెప్పెను. వారు మార్గ మధ్యముననే  శుద్ధిపొందిరి. అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి, యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరియుడు. అపుడు యేసు "పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని  స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?" అనెను. పిదప యేసు అతనితో "నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్లుము" అనెను. 

ఈ సువిశేష భాగంలో  కృతజ్ఞత, విశ్వాసం మరియు దేవుని కృపను గురించి చూస్తున్నాము. పది మంది కుష్టురోగులు అద్భుతమైన స్వస్థతను అనుభవిస్తున్నారు.    వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహాలు  అనేక విషయాలలో పొందుతూనే ఉంటాము. కాని దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడములో మాత్రము విఫలం అవుతుంటాము. దేవుని దగ్గరకు వచ్చి  కృతజ్ఞత తెలియజేయుటము,  ఒక వ్యక్తిని  దేవునికి దగ్గర చేస్తుంది. దేవునితో సఖ్యత ఏర్పాటు చేస్తుంది. మరియు దేవునితో అనుభంధమును ఏర్పరచి మనలను ఆయనకు ఇష్టులను చేస్తుంది. 

విశ్వాసం మరియు విధేయత

పది మంది కుష్టు రోగులు యేసు ప్రభువునకు ఎదురయ్యారు, దూరంగానే ఉండి, ప్రభువా మమ్ము కరుణింపుము అని వేడుకుంటున్నారు. ప్రభువు  కరుణ మీద వారికి ఎంతో విశ్వాసం ఉన్నది. ఆయనకు తమ సమస్య తెలిపితే వారికి స్వస్థత దయచేస్తాడు అని వారు నమ్మారు.   యేసు ప్రభువు వారిని వెళ్లి  యాజకులకు తమను తాము చూపించుకోమని చెప్పినప్పుడు వారు వెళ్లిపోతున్నారు. యాజకుడు మాత్రమే  కుష్టు రోగంతో బాధ పడేవారిని స్వస్థత పొందిన తరువాత వారు స్వస్థులైన విషయాన్నీ ధ్రువీకరించగలరు. అందుకే యేసు ప్రభువు వారిని పోయి యాజకుడిని కలవమని చెబుతున్నారు. యేసు ప్రభువు ఇతర సమయాలలో వలె వారిని తాకలేదు. వెళ్లి యాజకుడిని కలవమని చెప్పాడు. వీరు మమ్ములను తాకమని అడుగలేదు. ప్రభువు మాటకు విధేయించి వెళుతున్నారు. ప్రభువు చెప్పినట్లు చేయగానే వారు మార్గ మద్యంలో ఉండగానే వారు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గమనించవలసినది,  ప్రభువు పొమ్మని చెప్పినవెంటనే వారికి  స్వస్థత కలుగలేదు, అయినప్పటికీ ప్రభువు చెప్పగానే వారు యాజకుని కలువడడానికి వెళుతున్నారు. ప్రభువు మాట  మీద వారికి ఉన్న నమ్మకం తెలియజేస్తుంది. ప్రభువు మాటను విధేయించడం ద్వారా వారు స్వస్థత పొందుతున్నారు. ప్రభువు మాటను మారు మాటాడకుండా   విధేయించిన తీరు ప్రభువు మాటకు వారు ఇచ్చిన గౌరవం మరియు ఆతని మీద ప్రగాఢమైన నమ్మకం తెలియజేస్తుంది.  వారి విధేయతకు తగినట్లే మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుతున్నారు. 

సమరియుని ప్రత్యేకత 

అందరు స్వస్థత పొందుతున్నారు. కాని తనలో వస్తున్నా మార్పును గమనించగలిగినది ఒక సమరియుడు మాత్రమే. కృతజ్ఞత కలిగిన వారు ప్రభువు ద్వారా తమ జీవితంలో జరిగిన ప్రతి మార్పును గమనించగలుగుతాడు. కృతజ్ఞతచెల్లిస్తాడు. దేవుని అంతులేని అనుగ్రహాలకు పాత్రుడవుతాడు. యేసు ప్రభువునకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన వ్యక్తి కేవలం ఒక సమరియుడు మాత్రమే.యూదులు సమరియులతో ఏ పొత్తు ఉండకూడదు అనుకుంటారు. సమరియులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు అని వారిని దూరం పెట్టారు. వారిని విదేశీయులుగానే భావించేవారు. కాని దేవుడు అందరికి తన దయను కరుణను చూపిస్తూనే ఉంటాడు. మానవునిలా ఒకరిని దూరం పెట్టేవాడు కాదు ప్రభువు.  ప్రభువులోని ఈ గుణం మనం అనేక సార్లు చూస్తాము. సమరియును కృతజ్ఞత ప్రభువు తనకు చేసిన మేలును గుర్తు చేస్తుంది. అంతేకాక సమాజం తనను చూసిన విధంగా కాకుండా దేవుడు తనను నూతన సృష్టిగా చూస్తున్నాడు అన్న విషయం తనకు తెలుస్తుంది.  

యేసు ప్రభువు ఆ సమరియునితో పది మంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ? అని అడుగుతున్నాడు? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని అనుగ్రహాలు పొందుతాము కాని కృతజ్ఞత తెలుపుటకు మాత్రము  వెళ్లము. కృతజ్ఞత తెలుపడం అంటే  దేవున్ని స్తుతించటం. మన కృతజ్ఞత దేవుని మహిమను, కీర్తిని  వెల్లడి చేస్తుంది. అంతేకాక ఈ కృతజ్ఞత ఇతరులు ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత దేవుడు చేసిన మేలుకు సాక్ష్యంగా ఉంటుంది. 

 ప్రార్థన

కరుణామయుడైన ప్రభువా! మీ కరుణ అనంతం. ఎవరు మీ వద్దకు వచ్చి మిమ్ము కరుణించమని అడిగిన వారిని కరుణించారు. వారి జీవితాలలో లేమిని తీసివేసి వారికి కావలసిన వాటిని ఇచ్చి వారిని  సమృద్ధిగలవారీగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేశారు. అనేకసార్లు నా జీవితంలో కూడా సాంఘికంగా, ఆర్ధికంగా, నైతికంగా బలహీనంగా ఉన్న సమయాలలో సమాజం కుష్టువానిని బయట పెట్టినట్లు, నన్నును బయట పెట్టిన నీవు కరుణచూపించావు. నన్ను హత్తుకొనుటకు సంకోసించలేదు. నేను నీకు చెందినవాడినని ధృవీకరించావు.  అయినప్పటికీ  మీరు చేసిన మేలును గుర్తించకుండ ఉన్నాను. ప్రభువా! మీ మేలును గుర్తించకుండా,  మీకు కృతజ్ఞత తెలప కుండా ఉన్న సందర్భాలలో నన్ను క్షమించండి. మీరు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని, కృతజ్ఞత తెలియజేస్తూ, మీకు కీర్తిని,  మహిమను కలిగిస్తూ , మీ మేలులకు సాక్షులుగా జీవించేలా చేయండి. ఆమెన్. 

9, నవంబర్ 2024, శనివారం

32 వ సామాన్య ఆదివారం

32 వ సామాన్య ఆదివారం 
1 రాజుల 17:10-16, హెబ్రీ 9:24-28, మార్కు 12:38-44
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు మనము ఉదారముగా ఉండిన యెడల దేవుని యొక్క దీవెనలు పొందుతాము అనే అంశమును గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక విధముగా చెప్పుకోవాలంటే దేవునికి ఉదాహరణగా సమర్పించే అర్పణ గురించి ఈనాటి పఠణంలో తెలియచేస్తున్నాయి. దేవుని యొక్క దీవెనల వలన పొందిన ప్రతిదీ దేవునికి మరియు పొరుగు వారికి సమర్పించుటకు మనందరికీ మంచి హృదయము ఉండాలి. దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతూ మనకు ఉన్నదంతా సమర్పించుకుని జీవించిన ఎడల ఇంకా మనము అధికముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఏలియా ప్రవక్తను సారె ఫతు దగ్గరకు పంపిస్తున్నారు. ఈమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుని యొక్క కృపను పొందుకున్నది. ఈ మొదటి పఠణం యొక్క సన్నివేశం మనం గమనించినట్లయితే ఆహాబు రాజు యెసబేలు రాణి మరియు మిగతా ప్రజలు అన్య దైవముల ఆరాధించే సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరముల పాటు ఆ దేశమున కరువు సంభవిస్తుందని ఏలియా ప్రవక్త తెలియజేశారు ఈ కరువు కాల సమయంలో దేవుడు ఏలియాను సారెఫతుకు పంపిస్తున్నారు. ఒక క్లిష్ట సమయంలో దేవుడు ధనమున్న వారిని వదిలివేసి కేవలము అద్భుతము చేయుటకు ఒక పేద వితంతువును, అది కూడా అన్యురాలను ఎంచుకుంటున్నారు. బహుశా ఆమె మంచి వ్యక్తి అయి ఉండవచ్చు, ప్రార్థన పరిరాలయుండవచ్చు సోదర ప్రేమ కలిగిన వ్యక్తి ఉండవచ్చు అందుకని దేవుడు ఆమె యొక్క జీవితమును రక్షించుట నిమిత్తమై ఏలియా ప్రవక్తను అచటకు పంపిస్తున్నారు. 
ఏమి జీవితంలో మనము కొన్ని విషయములను ధ్యానం చేసుకుని మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నేర్చుకోవాలి. 
1. ఆమె యొక్క గొప్ప విశ్వాసం: ఏలియా ప్రవక్త  తన కోసం రొట్టెను కాల్చుకొని రమ్మని పిలిచిన సందర్భంలో వెంటనే దేవుని యందు ఉన్న విశ్వాసము వలన ఆమె ఏలియా కోరిన విధంగా చేశారు. మార్కు 9:23. విశ్వాసము వలన దేవుడు అద్భుతం చేస్తారని నమ్మారు. అబ్రహాము విశ్వసించారు కాబట్టే జాతులకు జ్యోతిగా దీవించబడ్డారు, మోషే విశ్వసించారు కాబట్టే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఉత్తమ నాయకునిగా చేయబడ్డాడు, కననీయ స్త్రీ విశ్వసించినది కావున దేవుని యొక్క వరము పొందినది, యాయీరు దేవుని విశ్వసించారు కాబట్టి తన యొక్క కుమార్తెను పొందగలిగాడు. విశ్వాసము ఉంటేనే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము చేస్తారు ఈ యొక్క పేద వితంతువు కూడా తానున్నటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని యందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నది కావున దేవుడు ఆమె జీవితమును దీవించారు. 
2. ఉదాహరణగా ఇచ్చే మనసు- ఈ వితంతువు తన జీవితంలో తనకు సహాయం చేసే వారు ఎవరు లేకపోయినా కానీ తనకు ఉన్న దానిలో తాను ఉదారంగా ఇచ్చే మనసు కలిగి ఉన్నది. ఆమె ఏలియాతో నేను ఇవ్వను అని చెప్పి ఉండవచ్చు కానీ తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం, ప్రేమ దాగి ఉన్నవని ఆమె భావించినది. ఉదారంగా ఇస్తే దేవుడి దీవిస్తారని భావించింది. లూకా6:38, ఉదారంగా ఇస్తే దేవుడు వారిని ప్రేమిస్తారని నమ్మినది. 2 కొరింతి 9:6-7 ఈ యొక్క పేద వితంతువు ఉదారంగా ఇచ్చారు కాబట్టి ఆమె జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సమృద్ధిగా దీవెనలు పొందింది. 
3. త్యాగం చేసే గుణం- ఈ వితంతువు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడు వర్షాలు వస్తాయో లేదో తెలియనప్పటికీ ఆమె తన యొక్క ఆహారమును వేరే వారికి త్యాగం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నది కొద్దిగా మాత్రమే అది తిని వారు కూడా చనిపోదామనుకున్నారు ఆ పిండి కేవలం ఒక్కరికి మాత్రమే సరిపోతుంది అయినా ఆమె త్యాగం చేసింది. అంత బాధ అయిన పరిస్థితుల్లో ఉన్న ఆమె త్యాగం చేసినది కావున ఆమె యొక్క త్యాగమును ప్రభువు దీవించారు. మనకు ఉన్న దానిలో త్యాగం చేసుకుని దేవునికి సమర్పించు జీవిస్తే తప్పనిసరిగా అది పెద్ద సమర్పణ. చాలా సందర్భాలలో దేవుడు మెచ్చుకునే సమర్పణ ఏమిటంటే దేవునికి ఉదారంగా ఇచ్చుట. ప్రభువు పేద వెధవరాలి కానుకను మెచ్చుకున్నారు. తొలి క్రైస్తవ సంఘ జీవితమును మెచ్చుకున్నారు అలాగే ఈ సారెఫతు వితంతువు జీవితమును మెచ్చుకుంటూ ఆమె త్యాగముకు ప్రతిఫలంగా ఆహారం సమృద్ధిగా ఇచ్చారు. 
4. ఆమె యొక్క సంపూర్ణ విధేయత- ఈమెలో దేవుని యొక్క ప్రవక్త పట్ల విధేయత చూపినటువంటి అంశమును చూస్తున్నాం. ప్రవక్త చెప్పిన వెంటనే ఆమె దేవుని యొక్క మాటలకు విధేయత చూపించి జీవించినది. ఎవరైతే విధేయత చూపిస్తారో వారి జీవితములు నిండుగా దీవించబడతాయి. పవిత్ర గ్రంథంలో అబ్రహాము, మోషే, యెహోషువ ఇంకా చాలామంది వ్యక్తులు దేవుడికి విధేయుత చూపించి దీవెనలు పొందారు అదే విధంగా ఈ వితంతువు కూడా దేవుడి యెడల విధేయత చూపించి ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. 
ఈనాటి సువిశేష భాగములో పేద వితంతువు యొక్క కానుకను దేవుడు అభినందించిన విధానం మనం చదువుకుంటున్నాం. కానుకల పెట్టె దగ్గర ప్రతి ఒక్కరూ కానుకలను ప్రభువు పరిశీలించారు. చాలామంది ధనవంతులు వారు కానుక వేసేటప్పుడు అది అందరికీ కనబడాలి అని విసిరి వేస్తుంటారు. ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగే అందరికీ కనబడేలా వారు కానుకలు పెట్టెలో ధనం వేసేవారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి కొంతగా దేవునికి సమర్పించేవారు కానీ ఈ యొక్క పేద వితంతువు తనకు ఉన్నది మొత్తము కూడా దేవునికి సమర్పించుకుని జీవించారు. ఆమె దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినది. తన యొక్క జీవిత మనుగడ కొరకు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి ఉంది. మనకు ఉన్న దానిలో దేవునికి ఇస్తే దానిలో గొప్ప త్యాగం ఏమీ లేదు కానీ మనకి ఉన్నది మొత్తం కూడా దేవునికి ఇస్తే అది గొప్ప త్యాగమే. ఈ యొక్క పేద వితంతువు తాను సమర్పించినది కొద్దిదైనప్పటికీ తన దగ్గర ఉన్న మొత్తము సమర్పించినది కావున ఆమె దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అందుకనే ప్రభువు ఆమెకు న్యాయం చేశారు. ఈనాటి ఈ యొక్క పరిశుద్ధగా గ్రంధ పఠణముల నుండి మనం కూడా త్యాగ గుణము, ఉదార స్వభావం, విశ్వాసము కలిగి జీవించుట అనే అంశములను అలవర్చుకొని జీవించటానికి ప్రయత్నం చేయాలి.
Fr. Bala Yesu OCD

8, నవంబర్ 2024, శుక్రవారం

లూకా 16: 1-8

 లూకా 16: 1-8

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: "ఒక ధనవంతునివద్ద  గృహనిర్వాహకుడు  ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, 'నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తిలేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహనిర్వాహకత్వమునుండి తొలగింపబడినపుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని యజమానుని ఋణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యాజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు? అని అడిగెను. వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పను. అంతట అతడు రెండవ వానితో 'నీవు ఎంత ఋణపడి వుంటివి?' అని అడిగెను. వాడు నూరుతూముల గోధుములు' అని  బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, ఎనుబది అని వ్రాసికొనుము'  అనెను. ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటే యుక్తిపరులు. 

యేసు ప్రభువు ఒక అవినీతి పరుడైన ఒక  గృహ నిర్వాహకుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక గృహ నిర్వాహకుడు తన భవిష్యత్తు కొరకు ఎలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడో,  తన ఉద్యోగం పోయినట్లయితే తను  ఎలా జీవించాలో ఎంతో ముందు చూపు కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరు ఆత్మకు సంబంధించి ఈ  లోకానికి చెందిన వారు ఈ లోకమునకు చెందిన జీవితం గురించియే ఇంత ముందు చూపు కలిగి ఉంటె వెలుగు పుత్రులు పరలోక జీవితం  పొందాలనుకునేవారు ఇంక ఎంత ముందు చూపు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు ప్రభువు.  ఒక సంపన్న యజమాని తన సంపదను నిర్వహిస్తున్నా గృహ నిర్వాహకుడు తన సంపదను వృథా  చేస్తున్నాడు అని తెలుసుకొని తనని పని నుండి తీసివేయ నిశ్చయించుకున్నాడు. గృహనిర్వాహకుడిని  యజమాని తీసివేయదలుచుకున్నది, తనలో నిజాయితీ లేదు అని మరియు తన సంపదను వృథా చేస్తున్నాడని,  నిజాయితీ లేకపోవడం, వృథా చేయడం, ఆ పనికి అతడు సరికాదు అని తెలుపుతున్నవి. దేవుడు మనకు ఇచ్చిన ప్రతి పని కూడా ఈ కోవలోనికే వస్తుంది. ప్రతి వ్యక్తికీ  దేవుడు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా ఉండటం మరియు  దేవుడు  ఇచ్చిన ఏ సంపదను కాని ప్రతిభను కాని వృథా చేయకుండా మన ఉన్నతికి మరియు  ఇతరుల ఉన్నతికి వాడాలి. 

 యజమాని గృహ నిర్వాహకున్ని తొలగించే ముందు అతని పనికి సంబంధించిన లెక్కలను  కోరుతున్నాడు. ప్రభువు ప్రతి వ్యక్తిని కూడా లెక్కను అడుగుతాడు. ఇక్కడ గృహనిర్వాహకుడు  త్వరలో ఉద్యోగం నుండి తీసివేయబడుతుందని  గ్రహించి, తన భవిష్యత్తు కోసం ఒక తెలివైన ప్రణాళికను రూపొందించుకున్నాడు. అది ఏమిటంటే తన యజమానునికి ఋణపడి ఉన్న వారిని పిలిచి వారి ఋణములను తగ్గించాడు దానిద్వారా ఈ ఋణస్థుల నుండి లభ్ది పొందవచ్చని అనుకుంటున్నాడు. గృహ నిర్వాహకునకు  తన గురించి తనకు  మంచి అవగాహన ఉంది, తాను ఎవరిని యాచించలేడని, మరియు శ్రమించుటకు శక్తిలేనివాడనని తెలుసుకున్నాడు. అప్పుడు తన భవిష్యత్తు కోసం  ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు. మన జీవితం గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. నా భవిష్యత్ ఏమిటి, నా ధ్యేయం ఏమిటి?  క్రీస్తు అనుచరునిగా నేను పరలోకం పొందటం నా ధ్యేయం.  

ఈ ఉపమానములో  ఆసక్తిని రేకెత్తించేది ఏమిటంటే, యేసు ప్రభువు ఆ గృహ నిర్వాహకునికి   మెచ్చుకొంటున్నాడు.  యేసు ప్రభువు గృహ నిర్వాహకుని నిజాయితి లేకపోవడాన్ని మెచ్చుకోవడం లేదు. తాను  ఉద్యోగం కోల్పోతే ఎలా బ్రతకాలో ముందుగానే ఆలోచించి యుక్తిగా ప్రవర్తించడాన్ని మెచ్చుకుంటున్నాడు.  ఈ లోకపు వ్యక్తులు  వెలుగుకు చెందిన వ్యక్తుల కంటే  వారి భవిష్యత్తు గురించి భరోసా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  యేసు ప్రభువు తన అనుచరులను కూడా వారి జీవితాలు పరిశీలించుకోవాలని  ఈ లోకానికి చెందిన విషయాలయందే ఇన్ని జాగ్రత్తలు తీసుకొనే వీరికంటే, పరలోక విషయాలను కోరుకునే వారు ఎక్కువగా తమను తాము పరిశీలించుకుంటూ, సంస్కరించుకుంటూ, పరలోకానికి అర్హులుగా మరాలని కోరుకుంటున్నాడు. 

ఈ ఉపమానం మనకు ఇవ్వబడిన సమయాన్ని, ప్రతిభను మరియు ఇతర అనుగ్రహములను  దేవుని చిత్తమునకు  అనుగుణంగా ఉపయోగించామో లేదో  పరిశీలించమని అడుగుతుంది. పూర్తిగా ప్రభువు చిత్తమునకు అనుకూలంగా వాడకపోయినట్లయితే ఒకసారి ఈలోక వ్యక్తులను చూసి, అల్పమైన వాటికోసమే ఎంతగానో ప్రణాళికలు వేసుకునే వారిని చూసి , నిత్య జీవం ఇచ్చే ప్రభువును పొందడం కోసం తగిన ప్రణాళిక వేసుకోమని చెప్తుంది. క్రీస్తు అనుచరులుగా ఆయనను పొందుటకు  ప్రణాళికబద్దంగా జీవిస్తూ,  జాగరూకత కలిగి నిజాయితితో కూడిన జీవితం జీవిస్తూనే, ఆధ్యాత్మిక సంపదను సంపాదించుటకు పాటుపడుదాం. 

ప్రార్ధన: ప్రభువా! మిమ్ములను తెలుసుకొని, మీరు మాకు ఇచ్చే గొప్ప అనుగ్రహాలు పొందుకుంటూ   వాటిని సరియైన విధంగా వాడుకోలేకుండా ఉన్నాము. మీరు ఇచ్చిన సమయాన్ని, ప్రతిభను  దుర్వినియోగం చేస్తున్నాము. అటువంటి సందర్భాలలో మమ్ము క్షమించండి. మీ అనుగ్రహాల విలువ తెలుసుకొని వాటిని మీ చిత్తము కొరకు వాడే వారినిగా మమ్ము దీవించండి.  అనేకసార్లు అవివేకంతో ధ్యేయం లేకుండా జీవిస్తున్నాము. అటులకాకుండ మిమ్ములను పొందాలని, మీ పరలోకంలో స్థానము పొందేందుకు ప్రణాళికతో జీవించేలా దీవించమని వేడుకొంటున్నాము. ఆమెన్. 

2, నవంబర్ 2024, శనివారం

31 వ సామాన్య ఆదివారము

31 వ సామాన్య ఆదివారము 
ద్వితియెపదేశకాండము 6:2-6
హెబ్రీయులు 7:23-28
మార్కు 12:28-34
            ప్రియా దేవుని బిడ్డలరా ఈ రోజు మనమందరము కూడా 31వ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము. ఈనాటి మూడు పఠనలు కూడా మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తాయి అదేమిటంటే దేవుని పట్ల భయభక్తులను  చూపించటం, యేసు క్రీస్తు ద్వారా క్షమాపణ పొందటం మరియు జీవిత కాలం ప్రేమతో జీవించడం వంటి వాటి గురించి తెలియజేస్తుంది. ఈ ప్రేమ మరియు భక్తి మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందంటే మనము దేవుని దగ్గరకు  మరింతగా చేరడానికి, ఆయన అనుగ్రహంలో నివసించడానికి ఉపయోగపడతాయి.

 మొదటిపఠనములో ద్వితియెపదేశకాండం గురించి మనం వింటున్నాం. దేవుడు మానవులయినటువంటి మనందరికి కూడా  అయన ప్రేమనిచ్చి, ఆయన ఆజ్ఞలను ఎల్లపుడు మన జీవితాలలో  పాటించాలని పిలుపునిచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ  దేవుడైన యావేను   నీ పూర్ణ హృదయంతో , ఆత్మతో ప్రేమించుము అని చెబుతున్నాడు, దీని ద్వారా మనమందరమూ కేవలం హృదయం గానీ లేదా మనసు గానీ కాకుండా సంపూర్ణంగా దేవుని పట్ల ప్రేమను చూపించాలని చెప్పబడుతుంది. ఈ ప్రేమ మనం పాటించేటువంటి ఆజ్ఞల ద్వారా, మన ప్రేమ దేవుని దగ్గర వ్యక్తమవుతుంది. మనం దేవుని వాక్కును లేదా అయన మాటలను మన హృదయాలలో నిలిపి, ప్రతి సందర్భంలో ఆయనను అనుసరించడంలో మన బలాన్ని పెంచుకోవాలని  ఈ మొదటిపఠనం తెలియజేస్తుంది.

      రెండొవ పఠనములో హెబ్రియులకు వ్రాసిన లేఖలో యేసు క్రీస్తు మనకందరికూడా ఒక గొప్ప శాశ్వత యాజకుడు అని. ఆయన మన కొరకు తన జీవితన్నే  శాశ్వతంగా త్యాగం చేసి, దేవుని దగ్గర లేదా అయన సన్నిధిలో మనకు ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటాడని, అంటే అయన యాజకత్వం వలన మనకు శాంతి మరియు విముక్తి లభిస్తుంది. క్రీస్తుప్రభువు  యొక్క త్యాగం ద్వారా మన జీవిత పాపాలకు నిరంతర క్షమాపణను మరియు మన రక్షణకు మార్గం చూపిస్తుందని రెండొవ పఠనము తెలియజేస్తుంది. 

                  చివరిగా సువిశేష పఠనములో రెండు ఆజ్ఞలా గురించి  అందరికి క్లుప్తంగా వివరిస్తున్నాడు, అ రెండు ఆజ్ఞలు ఏమిటంటే దేవుని పట్ల ప్రేమ మరియు సాటి మనువుని పట్ల ప్రేమ.

   ముందుగా మొదటిది దేవుని పట్ల ప్రేమను మనం చుసినట్లయితే, దేవుని పట్ల సంపూర్ణ ప్రేమను చూపించటం యేసు మొదటగా చెప్పిన ఆజ్ఞ, ఎందుకంటే నీ దేవుని సంపూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు బలంతో ప్రేమించుము అని అంటున్నారు. ఏ విధంగానంటే ఇది మనము  దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భక్తి మరియు విధేయతను సూచిస్తుంది. దేవునితో ప్రేమ బంధం అనేది మన జీవితంలో కలగలిపి ఉండాలి. ఈ ప్రేమతో మనం దేవుని ఆజ్ఞలను గౌరవిస్తూ, ఆయన మార్గంలో నడవగలుగుతాము. అంతే కాకుండా యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రేమ కేవలం మాటలలోనే కాకుండా మన  జీవితాలలో కూడా ఉండాలని అంటున్నారు. ఇది మొదటి ఆజ్ఞ.
మరి రెండొవ ఆజ్ఞ ఏమిటంటే మానవుని పట్ల ప్రేమ: ఈ ఆజ్ఞ అనేది మన చుట్టూ ఉన్నవారిని, మనలను ఇష్టపడేవారిని లేదా మనలను ఇష్టపడని వారిని, మన స్నేహితులకే కాకుండా ప్రతీ ఒక్కరిని ప్రేమించడం అనేది క్రైస్తవుల జీవితంలో మరియు ధర్మంలో ప్రధానమైనది. మనము ఏ  విధంగానైతే దేవుని ప్రేమను అనుభవిస్తామో అదే విధమైనటువంటి ప్రేమను ఇతరులకు పంచడంలోనే ఈ ఆజ్ఞ అనేది ఉంటుంది.

      కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మూడు పఠనలు కూడా క్రైస్తవులమైనటువంటి మనకి దైవభక్తిని, యేసు యొక్క శాశ్వత యాజకత్వాన్ని మరియు మానవుని జీవితంలో ప్రేమను ఒక దేవుని పోలి  అనుసరించడానికి ఆహ్వానిస్తున్నాయి. దేవుని ప్రేమలో జీవిస్తూ, యేసు ద్వారా శాంతి పొందుతూ, మన హృదయంలోని ప్రేమను ఇతరులకు పంచుకోవడం ద్వారా మనం నిజమైన క్రైస్తవులమని  నిరూపించవచ్చు.

ఫా.  జ్వాహాన్నెస్  OCD 

31 వ సామాన్య ఆదివారం

31 వ సామాన్య ఆదివారం 
ద్వితియోపదేశకాండము 6:2-6, హెబ్రీ 7:23-28 మార్కు 12:28-34
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుట మరియు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అనే అంశములను తెలుపుచున్నవి. 
ఈనాటి మొదటి పఠణంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించమని తెలుపుచున్నారు. ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా వారి యొక్క జీవితంలో అనేక రకములైనటువంటి మేలులు కలుగుతాయి అనేటటువంటి అంశమును కూడా ప్రవక్త తెలిపారు. ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించిన యెడల ఇశ్రాయేలు ప్రజలు కలకాలము బ్రతుకుతారు అదే విధముగా ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో క్షేమములు కలుగును మరియు పాలు తేనెలు ప్రవహించే నేల మీద వారు బహు గొప్పగా వృద్ధి చెందుతారు అదే విధముగా ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా దేవుడు వారిని వేయి తరముల వరకు ఆశీర్వదిస్తారు(నిర్గమ 20:6). ఈ యొక్క ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవి. ప్రభువైన యావేను పూర్ణహృదయముతోనూ, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను అని ప్రభువు కోరుకున్నారు. ప్రజల యొక్క మనసులు ఇక వేరే దైవముల మీద ఉండకుండా కేవలము యావే దేవుని మాత్రమే ఆరాధించి ప్రేమించాలి కాబట్టి ప్రభువు ఈ యొక్క ఆజ్ఞను ఇచ్చారు. ప్రేమ ఉండిన యెడల ప్రతి ఒక్కరి జీవితంలో ఏది అయినా పాటించవచ్చు ఎందుకనగా ప్రేమ ఉంటే ఆజ్ఞలను తు:చ తప్పకుండా నెరవేరుస్తారు. మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో యావే దేవుడిని మాత్రమే కాకుండా మిగతా దైవములను కూడా విశ్వసిస్తారు దీనిని ప్రభువు ఖండిస్తూ ఆయన ఒక్కరే నిజమైన దేవుడు అని తెలుపుచూ ఇక వేరే అన్యదైవములను విశ్వసించవద్దని మోషే ప్రవక్త ద్వారా తెలిపారు. యావే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పది ఆజ్ఞలను రెండుగా విభజించినట్లయితే మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగతా ఏడు ఆజ్ఞలు తోటి మానవులకు సంబంధించినవి ఈ రెండిటిని కలిపి పది ఆజ్ఞలు అని పిలుస్తారు ఇందులో దైవము మానవులు ఇద్దరు ఉన్నారు కాబట్టి దైవ - మానవ ప్రేమలు విడదీయునటువంటివి. ఈ రెండు ఎప్పుడూ కలసి ప్రయాణం చేయాలి. రైలు పట్టాలు ఏ విధంగానైతే కలిసి పోతుంటాయి అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు అంశాలు పాటిస్తూ జీవించాలి. ఏ ఒక్కటి తక్కువైనా అది నిజమైన సంపూర్ణ క్రైస్తవ జీవితం కాదు.
ఈనాటి రెండవ పఠణంలో ఏసుప్రభు యొక్క యాజకత్వమును గురించి బోధిస్తూ ఉన్నది. ఆయన ప్రజల పక్షమున మనవి చేయుట కొరకై శాశ్వత జీవియై ఉన్నారు. ఆయన దైవ ప్రేమ మానవ ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టే మన కొరకు తన యొక్క ప్రాణములను సమర్పించారు. ఆయన యొక్క యాజకత్వము గొప్పది. ఎందుకనగా ఎటువంటి పాపము చేయని నిష్కళంక గొర్రెపిల్ల మన కొరకు తన రక్తమును చిందించి తనను తానే దేవునికి మన పాపముల నిమిత్తము సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములో ఒక మంచి ధర్మశాస్త్ర బోధకుడు ఏసు ప్రభువుని, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడుగుచున్నారు అందుకుగాను ప్రభువు మొదటిగా దేవుడిని ప్రేమించమని తెలిపి, ఆ ప్రేమను ఇతరులలో వ్యక్తపరచమని కోరారు. ఈ ధర్మశాస్త్ర బోధనకునికి ప్రధాన ఆజ్ఞ తెలుసుకోవాలనిపించింది ఎందుకనగా యూదులు యావే దేవుడిచ్చిన పది ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా మార్చారు అందుకుగాను ప్రజలు ఆచరించడానికి కష్టంగా ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలలో ఏది ప్రధానమైనదో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు అందుకే యేసు ప్రభువును అడిగారు. ఏసుప్రభు దైవ ప్రేమ మానవ ప్రేమ రెండు వేరు పరపలేనటువంటివి అని తెలిపారు. ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్లే ఒకే ఆజ్ఞకు దైవ ప్రేమ, సోదర ప్రేమ అను రెండు అంశాలున్నాయి. దైవ ప్రేమ లేనిది సోదర ప్రేమ లేదు అలాగే సోదర ప్రేమ లేనిదే దైవ ప్రేమ లేదు. దైవ ప్రేమ నుండి సోదర ప్రేమ ఉద్భవిస్తుంది. మన అందరికీ దేవుడు తండ్రి కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలం కావున మన జీవితంలో దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించాలి. దేవుని యెడల ప్రేమ కలిగి జీవించటం అందరికీ సాధ్యమైనది ఎందుకనగా ఆయన మీద ఉన్న ప్రేమ వలన దేవాలయానికి వస్తాం, పరిచర్యలు చేస్తాం, దేవాలయ నిమిత్తమై ఎంతైనా ఉదారంగా అందజేస్తాం కానీ మన ప్రేమను మన పొరుగు వారితో పంచుకోలేం. పొరుగు వారిని ప్రేమించుట కొంతమందికి చాలా చాలా కష్టం. దేవుడిని ప్రేమించే వ్యక్తి తన తోటి వారిని ప్రేమించకపోతే అట్టి వ్యక్తి అసత్య వాది అని యోహాను గారి తెలిపారు. (1 యోహాను 4:20-21) కాబట్టి మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి, మిత్రులను ప్రేమించాలి, మన యొక్క నాశనమును కోరు వారిని ప్రేమించాలి. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన యెడల మనందరి యొక్క జీవితములో ఎంతో సంతోషంగా ఉంటాయి అలాగే ఈ భూలోకమే పరలోకంగా మారుతుంది. మనము ఏ పని చేసినా దానిని ప్రేమతోనే చేయాలి కాబట్టి ప్రేమ అనేది మన యొక్క క్రైస్తవ జీవితానికి పునాది లాగా ఉండాలి తద్వారా మనందరం మంచి క్రైస్తవ విశ్వాస జీవితమును జీవించగలుగుతాం. 
 Fr. Bala Yesu OCD

26, అక్టోబర్ 2024, శనివారం

30వ సామాన్య ఆదివారం

30వ సామాన్య ఆదివారం 
యిర్మియా 31:7-9, హెబ్రీ 5:1-6, మార్కు 10:46-52
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు దేవుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడినటువంటి వారికి చేసేటటువంటి మేలులను తెలియజేస్తున్నాయి. మానవ శక్తి మీద, ఆలోచన మీద కాక సంపూర్ణముగా దేవుడి మీద ఆధారపడితే ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. 
ఈనాటి మొదటి పఠణంలో యిర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 34వ అద్యాయాలను ఓదార్చేపుస్తకమని, ప్రశాంత పరిచే పుస్తకమని అదేవిధంగా ఇశ్రాయేలీయులను తిరిగి తమ వారితో ఐక్యపరిచుటను తెలియచేయు పుస్తకమని అంటారు. ఎందుకనగా ఈ నాలుగు అధ్యాయాలలో ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు సంతోషకరమైనటువంటి మాటలను తెలియజేశారు.యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అస్సిరీయుల బానిసత్వం నుండి వారి యొక్క సొంత భూమికి తీసుకొని వెళతారు అనే సంతోషకరమైన విషయం తెలుపుచున్నారు. ఈ యొక్క అస్సిరీయులు, ఇశ్రాయేలును పూర్తిగా ధ్వంసం చేసి అక్కడివారిని బానిసలుగా కొనిపోయారు. ఇలాంటి ఒక బాధకరమైన సమయంలో యిర్మియా ప్రవక్త దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానము మరువడని, ఆయన దయ కలిగిన దేవుడని, ప్రజల యొక్క పాపములను క్షమించి మరలా వారిని తన చెంతకు చేర్చుకుంటారని ప్రవచించారు. దేవుడు ఎవరిని మరువకుండా, విడిచిపెట్టకుండా, కుంటి వారిని, గ్రుడ్డివారిని ఏ విధముగా గర్భవతులను సైతము అందరిని కూడా సొంత భూమికి తీసుకొనివస్తారని వాగ్దానం చేశారు. ప్రభువు ఇస్రాయేలు ప్రజల పట్ల ఎల్లప్పుడూ విశ్వాసనీయుడుగానే ఉన్నారు ఆయన సీనాయి పర్వతం దగ్గర చేసినటువంటి వాగ్దానమును ఎన్నడూ మరువలేదు. ప్రభువు వారిని విముక్తులను చేసినందుకుగాను ప్రతిఫలముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థనలు సమర్పిస్తారన్నారు. అదే విధముగా దేవుడే స్వయముగా తన ప్రజలను నడిపిస్తారని తెలిపారు అలాగే వారు పడిపోకుండా, మార్గము తప్పిపోకుండా ఆయనే ఒక మార్గ చూపరిగా ఉంటూ తమ యొక్క సొంత ప్రాంతమునకు నడిపించారు అని యిర్మియా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఈ యొక్క సంతోషకరమైన అంశమును తెలియజేశారు. తండ్రి తన బిడ్డలను చూసుకున్న విధముగా దేవుడు కూడా ఇశ్రాయేలును తన సొంత బిడ్డల వలె కాచి కాపాడుతూ వారి వెన్నంటి ఉంటారని పలికారు. 
ఈనాటి రెండవ పఠణంలో  యాజకత్వమును గురించి తెలుపుచున్నది. ప్రతి యాజకుడి యొక్క యాజకత్వము దేవుడి నుండి వచ్చినదని తెలుపుతూ వారు బలహీనులైనప్పటికీ తమ కొరకు తాము, తన పాపముల కొరకు అదేవిధంగా ఇతరుల యొక్క పాపముల కొరకు బలిని అర్పింపవలెనని తెలిపారు. యాజకత్వము అనే దైవ పిలుపు ప్రభువునుండే స్వయముగా వచ్చినది. దేవుడే ప్రతి ఒక్క యాజకుడిని నియమించారు. తండ్రి కుమారుడను నియమించిన విధముగా మనలను దేవుడు యాజకులుగా నియమిస్తున్నారు. 
ఈనాటి సువిశేష భాగములో ఏసుప్రభు బర్తిమయి అను గుడ్డివానికి దృష్టిని బసగిన అంశమును చదువుకుంటున్నాము. ఈయన యొక్క జీవితంలో మనము గ్రహించవలసినటువంటి కొన్ని అంశములు;
1. గ్రుడ్డివాడు గ్రహించగలిగాడు. బర్తి మయి అనే బిక్షకుడు తనకు చూపు లేకపోయినా యేసు ప్రభువు యొక్క దైవత్వమును గ్రహించగలిగాడు. ఎందరికో కన్నులున్నప్పటికీ వారు ఏసుప్రభు యొక్క కార్యములను చూసి గుర్తించలేకపోయారు కానీ ఈ బర్తిమయి కేవలం యేసు ప్రభువును గూర్చి విని ఆయన గొప్పతనం గ్రహించ గలిగాడు. వినుట వలన విశ్వాసము కలుగును.
2. విశ్వాసము కలిగి దేవుడిని ఆశ్రయించారు. బర్తిమయి ప్రభువు నందు ఆచంచలమైన విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభువు తన చెంతకు వచ్చిన వెంటనే తనకు చూపునివ్వమని విశ్వాసముతో ప్రార్థించాడు. 
3. బర్తిమయి ప్రభువును తనకు ఏది ముఖ్యమో దాని కొరకు మాత్రమే ప్రార్థించారు. ఆయన ప్రభువుని దానం చేయమని అడగలేదు, తన యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అడగలేదు కానీ తనకు చూడటానికి చూపును ఇవ్వమని కోరాడు. తన యొక్క జీవితంలో చూపు అనేది ముఖ్యము కాబట్టి దాని కొరకే బర్తిమయి ప్రార్థించాడు. బహుశా ఆయన కూడా ప్రభువుని చూడాలని ఆరాటపడి ఉండవచ్చు అందుకే కేవలం చూపు అని మాత్రమే ప్రసాదించమని అడిగాడు.
4. బర్తిమయి పట్టుదల - తన తోటి వారు తనను ఎంత నిశ్శబ్దముగా ఉండాలని ప్రయత్నం చేసిన  బర్తిమయి పట్టుదలతో ఎవరి మాటను పట్టించుకోకుండా ఆయన అనుకున్నది సాధించడానికి గొంతెత్తి మరి ప్రభువుని పిలిచారు. 
5. బర్తిమయి ప్రభువు యొక్క కనికరము కొరకు ప్రార్థించారు. ఆనాటి కాలంలో ఎవరికైనా ఏదైనా లోపం(అనారోగ్యం) ఉంటే దానిని దేవుని శిక్షగా భావించేవారు అందుకే ఒకవేళ ఆయన మీద దేవుని శిక్ష ఉండిన యెడల దానిని తీసివేయమని, కరుణతో క్షమించమని ప్రభువు కరుణ కొరకు వేడుకున్నాడు. 
6. ప్రభువుని అనుసరించుట- బర్తిమయి ఏసుప్రభు తన జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నారు. మేలులు పొంది తిరిగిపోయిన వారి కన్నా, మేలు చేసినటువంటి దేవుడిని వెంబడించినటువంటి గొప్ప వ్యక్తి ఈ బర్తిమయి.
7. ప్రభువు మన చెంతకు వచ్చినప్పుడు ఆయనను మనము భర్తిమయి వలే గుర్తించాలి. అనేక సందర్భాలలో దేవుడు దివ్య బలి పూజ ద్వారా, ప్రార్థన ద్వారా మన చెంతకు వస్తారు ఆయనను మనము గుర్తించి కలుసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో భర్తిమయి వలె మేలులు కలుగును.
8. దేవుడి మీద ఆధారపడుట- బర్తిమయి సంపూర్ణముగా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడ్డాడు కాబట్టి ప్రభువు ఆయన్ను దీవించారు. 
మన యొక్క అనుదిన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, దేవుని యొక్క కరుణ కోరుకుంటూ ఆయన యొక్క దీవెనలు పొందాలి. 
Fr. Bala Yesu OCD.

19, అక్టోబర్ 2024, శనివారం

ఇరవై తోమ్మిదవ సామాన్య ఆదివారము

ఇరవై తోమ్మిదవ 
సామాన్యకాలపు ఆదివారము 

యెషయా 53:10-11
హెబ్రీయులకు 4:14-16
మార్కు 10:35-45

క్రీస్తునాధునియందు ప్రియ దేవుని బిడ్డలరా, ఈనాడు మనమందరము సామాన్య కాలపు ఇరవై తోమ్మిదవ ఆదివారంలోనికి ప్రవేశించి యున్నాము, ఈనాటి మూడు పఠనలు కూడా ఒకే తీరు మాటల గురించి మాట్లాడుతున్నాయి: అవి ఏమిటంటే త్యాగం, సేవ, మరియు విముక్తి అనే అంశాల గురించి మనకు వివరిస్తున్నాయి.
               ముందుగా మొదటి పఠనములో యెషయా గ్రంధములో మనము గమనించవలసిన అంశం చుసినట్లయితే యెషయా ప్రవక్త యేసు క్రీస్తు గూర్చి ముందుగా ప్రజలందరికి కూడా వివరిస్తున్నాడు. ఏవిధంగానంటే బాధామయ  సేవకుని జీవితంలో ఏవిధంగానైతే బాధలు అనుభవిస్తాడో అదేవిధమైనటువంటి బాధలను క్రీస్తు ఎదుర్కొంటాడు  అనే దానిని క్లుప్తంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు  తన సేవకున్నీ  బాధలు అనుభవింపచేల చేస్తున్నాడు . అందుకనే సేవకుడు తన ప్రాణాన్ని పాప బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, దేవుడు ఆయనకు తగిన ప్రతిఫలముగా సేవకుని మహిమపరుస్తాడు. ఎందుకంటే ఈ దుఃఖం, బాధ, వేదన ద్వారా దేవుడు తన ప్రణాళికను తన సేవకుని ద్వారా నెరవేర్చాడు. మన పాపాల కోసం క్రీస్తు తన జీవితాన్ని మరియు తన సర్వస్వాన్నీ ఇచ్చేందుకు వెనుకంజ వేయలేదు, అది దేవుని ప్రేమ, కృపా  సారాంశం. క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి, మన పాపాలను తుడిచివేశాడు మరియు తన అర్పణకు ప్రతిఫలంగా దేవుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. యేసు మన పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, బాధను అనుభవించాడు. ఆయన త్యాగం ద్వారా మనకు విముక్తి మరియు క్షమాపణ లభించాయి.
       రెండొవ పఠనని గ్రహించినట్లయితే హెబ్రీయులకు వ్రాసిన లేకలో, యేసు మన ప్రధానయాజకుడిగా మన బలహీనతలను మరియు మనలో ఉన్న నైపుణ్యాలను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక మానవునివలె మన మాదిరిగా ఈ లోకానికి వచ్చి అన్ని పరీక్షల్ని, అవమానలను అనుభవించి కూడా ఏ  పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, ఆయన వద్దకు వచ్చినవారికి ఆయన కృప తోటి సహాయపడతాడు. ఈ వచనాలు మనలను ఆయన  కాపాడే కృపను, అయన యొక్క దయను తెలుపుతున్నాయి. మనకు అయన కృపను అందించే ప్రయత్నం చేస్తాడు. ఆయన త్యాగం మనకు ధైర్యం, ఆశ కలిగిస్తుందని రెండొవ పఠనం మనకు పూర్తిగా వివరిస్తున్నాయి.
              చివరిగా సువిశేష పఠనములో యేసు ప్రభు ఒక నిజమైన సేవకుడిగా తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులకు అయన ఒక ఉదాహరణ ఉంటున్నారు ఎందుకంటే మానవుల యొక్క బలహీనతలను అర్థం చేసుకుంటు, ఆయన కూడా మనవుని మాదిరిగా శరీరాన్ని  ధరించి అన్ని కష్టాలను, పరీక్షల్ని  అనుభవించాడు, కానీ అయన మాత్రం మనలాగా పాపం చేయలేదు. అందువల్ల,  ఆయనను ఆశ్రయించి, అయన యొక్క కృప మరియు దయను పొందేందుకు,  ఆయన దగ్గరకు వచ్చినవారికి ఆయన సహాయపడతాడు. ఈ వాక్యాలు అన్ని కూడా మనకు ఆయన  కృపను మరియు దయను తెలుపుతున్నాయి. యేసయ్య తన ప్రాణాన్ని అనేకమందికి రక్షణగా మరియు విముక్తిగా ఇచ్చాడు, ఇది క్రైస్తవ జీవితంలో అనుసరించాల్సిన మార్గాన్ని అయన మనకు ఒక ఉదాహరణగా తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు.

           కాబ్బటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, త్యాగం, మరియు సేవ మన జీవితాలలో కీలకమైనవి అని ఈయొక్క మూడు పఠనలు కూడా మనకు వివరిస్తున్నాయి. అందుకని మనము దేవునికి ఇష్టనుసరంగా జీవించలని మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్దించుకుందాము.

Fr. Johannes OCD

29 వ సామాన్య ఆదివారం


యెషయా 53:10-11, హెబ్రి 4:14-16,మార్కు 10:35-45
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు ప్రభువుని అనుసరించేవారు సేవక రూపం కలిగి జీవించాలి అనే అంశమును, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి వారు సేవకులు వలె తమ యొక్క అధికారమును సద్వినియోగపరుచుకోవాలని వినయంతో సేవ చేయాలని కూడా  తెలుపుతున్నాయి.
ఈనాటి మొదటి పఠణంలో  బాధామయ సేవకుని యొక్క జీవితం గురించి తెలుపుచున్నది ఈ యొక్క బాధామయ సేవకుడు మరెవరో కాదు క్రీస్తు ప్రభువే ఆయన అందరి కోసం అనుభవించేటటువంటి శ్రమలను గురించి యెషయా ప్రవక్త తెలియజేశారు. క్రీస్తు ప్రభువు యొక్క మరణము పాప పరిహార బలి అయ్యింది. అందరి యొక్క పాపముల నిమిత్తమై ప్రభువు మరణించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి కొందరికి సంతోషంగా ఉన్న సమయంలో శ్రమలు వస్తాయి, కొందరికి జీవితం యధావిధిగా సాగించే సమయంలో శ్రమలు వస్తుంటాయి. కొంతమందికి శ్రమలు అప్పుడప్పుడు మరి కొంతమందికి శ్రమలు తరచుగా వస్తాయి. కొంతమంది శ్రమలు తట్టుకొని జీవిస్తే మరి కొంతమంది శ్రమలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటారు. మరికొందరు విశ్వాసాన్ని కూడా కోల్పోతారు.
కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఇతరులకు మేలు చేయుట కొరకు శ్రమలు అనుభవించవచ్చు. పునీత చిన్న తెరెసమ్మ గారు తన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో తాను తప్పు చేయనప్పటికీ దానిని అంగీకరించుకొని ఆ యొక్క బాధలను పాపుల యొక్క హృదయ పరివర్తనం కొరకై సమర్పించేవారు. ఈనాటి మొదటి పఠణంలో బాధామయ సేవకుడు ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ కేవలము ఇతరుల యొక్క శ్రేయస్సు కొరకై, రక్షణ కొరకై తన యొక్క ప్రాణములను త్యాగం చేశారు. ఈనాటి రెండవ పఠణంలో హెబ్రీలకు రాయబడిన లేఖలో రచయిత యేసు ప్రభువు యొక్క యాజకత్వమును గురించి తెలుపుచున్నారు. ఆయన మనవలె శోధింపబడినప్పటికీ పాపము చేయనటువంటి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన చెంతకు చేరి ఆయన కృపను పొందుదుమని తెలుపుచున్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటూ తానే ఒక బలిగా ఇతరుల కొరకు సమర్పించుకున్నారు.
ఈనాటి సువిశేష భాగములు యేసు ప్రభువు యొక్క శిష్యులు యోహాను యాకోబులు, ప్రభువు స్థాపించబోయే రాజ్యంలో అగ్రస్థానాల కొరకై ఆశపడ్డారు ఆయన రాజ్యాన్ని ఇహలోక సంబంధమైన రాజ్యముగా, సిరిసంపదలతో కూడిన రాజ్యముగా, శాంతిభద్రతలతో తులతూగే ఒక గొప్ప రాజ్యంగా భావించారు అట్టి రాజ్యములో వీరికి ముఖ్యమైనటువంటి స్థానములను ఇవ్వమని ప్రభువును అడుగుచున్నారు. యోహాను, యాకోబులకు దేవుడు మొదటి స్థానం పేతురుకు ఇచ్చారు అని తెలుసు తరువాత రెండవ- మూడవ స్థానములను యోహాను యాకోబులకు ఇవ్వమని వారు అధికారం కోసం అడుగుచున్నారు. అనేక సందర్భాలలో యోహానును యాకోబును ఏసుప్రభు తనతో తీసుకుని వెళ్లారు. పేతురు అత్త అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరిని తనతో పాటు తీసుకెళ్లారు, యాయీరు కుమార్తె అస్వస్థతతో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రభువుతో ఉన్నారు, దివ్యరూపధారణ సమయంలో కూడా మీరు ఏసుప్రభు తోనే ఉన్నారు. కాబట్టి వీరు కూడా ప్రభువు మాకు ప్రాముఖ్యతనిచ్చారు అయినప్పటికీ అధికారం కొరకు ఆశించారు.
ఇక్కడ ఏసుప్రభు నిజమైన అధికారమంటే పెత్తనం చెలాయించటం కాదు సేవ చేయటం అని తెలియపరుస్తున్నారు. ఈ సువిశేష భాగములో మనము గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. 
1. ప్రతి శిష్యుడు/ అధికారి సేవకు రూపం దాల్చాలి. దేవుడిని వెంబడించేటటువంటి సమయములో ఎటువంటి పదవులను ఆశించకుండా కేవలము సేవకుని వలె దేవుడి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. 
2. ఇచ్చిన అధికారమును వినయముతో నెరవేర్చాలి. కొన్ని సందర్భాలలో అధికారము వచ్చిన తర్వాత అనేక మందికి గర్వం వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువు చెప్పే అంశం ఏమిటంటే వినయంతో అధికారమును వినియోగించుకోవాలి అని తెలుపుచున్నారు. తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనము చాటి చెప్పాలి.
3. ప్రతి అధికారంలో త్యాగపూరితమైన ప్రేమ ఉండాలి అనగా ఇతరులకు మేలు చేయు సమయంలో తాను (అధికారంలో ఉన్న వ్యక్తి)ఎన్ని బాధలైనా పొందవలసి వస్తే పొందటానికి సిద్ధముగా ఉండాలి. 
4. ప్రతి సేవకుడిలో/అధికారి వినయం ఉండాలి ఎందుకంటే ఏసుప్రభు నేను ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చాను సేవింపబడుటకు రాలేదు అని తెలిపారు. కాబట్టి ఏసుప్రభుని వెంబడించే ప్రతి ఒక్క శిష్యుడు- శిష్యురాలు ఆయన వలె వినియం కలిగి జీవించాలి. 
5. నిస్వార్థ సేవను చేయాలి. ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభువు యొక్క సేవ చేయాలి.
6. ఏసుప్రభు వలై నిస్సహాయులను అనాధలను స్వీకరించి వారికి మేలు చేయాలి. 
ప్రతి క్రైస్తవుడు అధికారాన్ని సేవగా భావించి క్రీస్తు వలే కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సమాజములో జరుగుతున్నటువంటి అన్యాయమును ఎదుర్కొని న్యాయం కొరకు పోరాడాలి. పేదల పట్ల బలహీనుల పట్ల దయా కనికరము కలిగి వారి కొరకు పోరాడటానికి ప్రయత్నించాలి. 

Fr. Bala Yesu OCD

12, అక్టోబర్ 2024, శనివారం

28 వ సామాన్య ఆదివారం


సొలోమోను జ్ఞాన గ్రంధం 7:7-11
హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30
ఈనాటి పరిశుద్ధ గ్రంథములో మన యొక్క జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి, ఆయనను కలిగి ఉండుట కొరకు దేనినైనా వదులుకుని జీవించాలి అనే అంశమును గురించి తెలుపుచున్నవి. ప్రతి ఒక్కరి యొక్క అనుదిన జీవితంలో రోజు ఈ లోక సంబంధమైనటువంటి విషయములతో ప్రాముఖ్యతను ఇచ్చి జీవిస్తారు. కొందరికి బంగారము అంటే విలువ ఎక్కువ, అందరికీ వెండి అంటే ఇష్టం, మరికొందరికి పదవులు ఇంకొందరికి సుఖ భోగాలు, గౌరవ మర్యాదలు ఇష్టం అందుకని వాటికి ప్రాముఖ్యతను, విలువనిచ్చి అవి కలిగి ఉండుట కొరకు ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పఠణంలో సొలోమోను తన యొక్క జీవితంలో ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని దానికి విలువనిచ్చి ఆ యొక్క వరము కొరకు ప్రార్థించాలి. సొలోమోను దైవ భక్తుడిగా, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, ఆయనయే స్వయంగా తెలుపుతున్నటువంటి మాటలు ఏమిటంటే నేను ప్రార్థించినప్పుడు వివేక వరము నాకు లభించినది. దేవుడిని ప్రార్ధించినది వివేకము కొరకు. జ్ఞానము తాను సంపాదించినట్లయితే ఇంక తన జీవితంలో ఏదీ కూడా అవసరం లేదు అని సొలోమోను గ్రహించాడు కాబట్టి జ్ఞానమును సంపాదించుట కొరకు దేవుని ప్రార్థించారు. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం దేనికొరకు ప్రార్థిస్తున్నాము అని మనము ఒకసారి పరిశీలించుకోవాలి. సొలోమోను రాజు ఆయన తన యొక్క వివేకము ద్వారా తెలుసుకున్న సత్యమేమిటంటే ఈ లోక పదవుల కన్నా, సంపదల కన్నా, సింహాసనములకన్నా, రాజు దండనముకన్నా విలువైనది జ్ఞానము అని తెలుసుకున్నారు అందుకని దానిని పొందుట కొరకై దేనినైనా సరే వదులుకొనుటకు సిద్ధపడుతున్నారు. సొలోమోను యొక్క విజ్ఞానము వలన తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా జ్ఞానముతో సరిపోవని తెలిపారు. జ్ఞానముతో పోల్చినప్పుడు బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అనేది మట్టి పెళ్లతో సమానం. ఆయన తన యొక్క జీవితంలో ఆరోగ్యము కంటే సౌందర్యం కంటే ఎక్కువగా జ్ఞానమునే పొందాలని ఆశించాడు. మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏది కావాలో అనే అవగాహన లేదు. కొన్ని సందర్భాలలో సంపదలకే ఎక్కువ విలువ ఇస్తాము, కానీ సొలోమోను మాత్రం విజ్ఞానమునకు మొదటి స్థానమును ఇచ్చారు ఎందుకనగా విజ్ఞాన ద్వారా అంతా కూడా సంపాదించవచ్చు. ఆయనకు ఉన్నటువంటి విజ్ఞానమును బట్టి షెభారాణి కూడా ఆయనను చూడటానికి వచ్చారు. ఇంగ్లీష్ లో ఒక సామెత one idea can change your life ఇది ఎలా సాధ్యమంటే మనకు విజ్ఞానం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే. మనము కూడా విజ్ఞానమును దేవుని యొక్క కృప వలన పొందాలి. విజ్ఞానము కొరకు ప్రార్థించాలి ఈ యొక్క విజ్ఞానముతో మన యొక్క జీవితములో ఏది ఉత్తమమైనదో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవింప సాగాలి. విజ్ఞానము మనకు నేర్పిస్తుంది మన జీవితంలోను సరి చేస్తూ ఉన్నది కావున సొలోమోను ఏ విధముగానయితే దేవుని యొక్క జ్ఞానమునకు ప్రధాన స్థానమును ఇచ్చి దానిని సర్వస్వంగా భావించి దానిని పొందుట కొరకై దేవుడిని ప్రార్థించి వేడుకున్నాడో అదేవిధంగా మనం కూడా దేవుడిని ప్రార్థించి విజ్ఞానాన్ని పొంది మంచి విశ్వాసులుగా జీవించాలి. 
ఈనాటి రెండవ పఠణంలో దేవుని యొక్క వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది అని తెలుపుచున్నది. ఆయన యొక్క వాక్కు మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగిస్తుంది మనలో హృదయ పరివర్తన కలుగచేస్తుంది. ఆ విలువైనటువంటి దేవుని యొక్క వాక్కు కొరకు మనము తపించాలి. మన జీవితములను సరిచేసుకోవాలి. 
ఈనాటి సువిశేష పఠణములో ఒక యువకుడు నిత్యజీవితము పొందుటకు నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. అందుకు తనను, ఏసుప్రభు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించమని తెలుపుతున్నారు ఆ యువకుడు అవి అన్నియు చిన్ననాటి నుండే పాటిస్తున్నాడని తెలిపారు. అప్పుడు ప్రభువు ఆయనకు తన దగ్గర ఉన్నటువంటి ధనము పేదలకు దానం చేసి ఇవ్వమని తెలిపారు కానీ అతడు దానికి ఇష్టపడలేదు. ఈ యువకుడు యొక్క ఉద్దేశ్యము నిత్య జీవము పొందుట మరి ఆ ఉద్దేశం కొరకు ఎందుకు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ధనమును విడిచిపెట్టలేదు? ఈ యువకుడు ధనమే ముఖ్యమని భావించాడు. ధనము ఉన్న ఎడల తనకు మంచి గౌరవము అదే విధముగా తన భవిష్యత్తు బాగుంటుందని భావించాడు అందుకే ధనానికి ప్రాముఖ్యతను ఇచ్చి దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. వాస్తవానికి ధనపేక్ష అన్నది సర్వ అనర్ధాలకు మూలం. ఈ యువకుని యొక్క హృదయం ధనాశతో నిండి ఉన్నది కాబట్టి దానిలో దేవునికి స్థానము ఇవ్వలేదు. ధనాపేక్ష అతని పట్టి పీడిస్తుంది. ఈయొక్క ధనం వలనే ఆయన ఉదార స్వభావిగా జీవించి లేకపోయాడు. ఈ యొక్క యువకుడు తన యొక్క జీవితంలో ధనం కన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని భావించినట్లయితే ఆయన మీద ఆధారపడి జీవించేవాడు, ఆయనకు నిత్యజీవం లభించేది కానీ ఈ యొక్క యువకుడు దేవుని కన్నా ధనానికే ప్రాముఖ్యతనిచ్చి జీవించాడు అందుకనే విలువైన నిత్య జీవితాన్ని కోల్పోయాడు. ఈ యువకునికి దేనికి ప్రాముఖ్యత నివ్వాలో, దేనిని కలిగి జీవించాలో తెలుసుకోలేక పోయాడు అందుకే తన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏసుప్రభు తన కొరకు ఎవరైతే సమస్తము విడిచిపెడతారో వారు నూరంతలుగా ఆశీర్వాదం పొందుతారని తెలిపారు (మార్కు 10:28-31). ఈ విషయాన్ని ఆ యువకుడు మరిచిపోయారు. మన యొక్క జీవితంలో దేవునికి విలువ నుంచి జీవించాలి అప్పుడు దేవుడు మనకు సమస్తము కూడా సమకూర్చును.
Fr. Bala Yesu OCD

The Feast of Epiphany

The Feast of Epiphany  క్రీస్తు సాక్షాత్కార పండుగ యెషయా 60:1-6,ఎఫేసీ3:2-3, మత్తయి 2:1-12 ఈనాడు తల్లి శ్రీ సభ ముగ్గురు జ్ఞానులపండుగను కొనియాడ...